WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  ఆర్సీబీ బ్యాటర్ల తీరు మారలేదు. మిడిల్ ఓవర్స్ లో పరుగులు తీయడానికి నానా తంటాలు పడుతున్న ఆ జట్టు  బ్యాటర్లు  నేడు ఢిల్లీతో మ్యాచ్ లో కూడా అదే విధంగా విఫలమయ్యారు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ తడబడి నిలబడింది. టాపార్డర్ విఫలమైనా.. మిడిల్ ఓవర్స్ లో పరుగుల రాక గగనమే అయినా తర్వాత పుంజుకుంది. ఎలీస్ పెర్రీ (52 బంతుల్లో 67 నాటౌట్, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రిచా ఘోష (16 బంతుల్లో 37, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) లు ఢిల్లీ బౌలర్లను ఆటాడుకున్నారు. ఇన్నింగ్స్ 14 ఓవర్ల వరకు ఆర్సీబీపై ఆధిపత్యం చెలాయించిన ఢిల్లీ బౌలర్లు తర్వాత చేతులెత్తేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ.. 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. 

టాస్ ఓడి మొదలు బ్యాటింగ్ కు వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆట ఈ మ్యాచ్ లో కూడా ఏమీ మారలేదు. గత నాలుగు మ్యాచ్ లలో మాదిరిగానే కెప్టెన్ స్మృతి మంధాన ఈ మ్యాచ్ లో కూడా విఫలమైంది. 15 బంతులాడిన మంధాన.. అతి కష్టమ్మీద 8 పరుగులు చేసి శిఖా పాండే వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి రోడ్రిగ్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 

మరో ఓపెనర్ సోఫీ డివైన్ (19 బంతుల్లో 21, 3 ఫోర్లు) కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. రెండో వికెట్ కు ఎలీస్ పెర్రీతో కలిసి ఆమె 17 పరుగులే జోడించింది. 6 ఓవర్లు ముగిసేటప్పటికీ ఆర్సీబీ చేసిన పరుగులు వికెట్ నష్టానికి 29 రన్స్ మాత్రమే. 

ఈ సీజన్ తొలి మ్యాచ్ నుంచి మిడిల్ ఓవర్స్ లో పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్న ఆర్సీబీ బ్యాటర్లు మరోసారి తమ బలహీనతను ప్రదర్శించారు. పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డ డివైన్ కూడా.. శిఖా పాండేనే వేసిన 9వ ఓవర్ చివరి బంతికి క్లీన్ బౌల్డ్ అయింది. అడపాదడపా పెర్రీ బౌండరీలు బాదినా అవి రన్ రేట్ ను ఏమాత్రం పెంచలేకపోయాయి. హెథర్ నైట్ (11) కూడా విఫలం కావడంతో ఆర్సీబీ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి.

గేరు మార్చిన పెర్రీ - రిచా.. 

14 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 3 వికెట్ల నష్టానికి 68 పరుగులే చేయగా శిఖా వేసిన 15వ ఓవర్ లో పెర్రీ.. 4, 6 కొట్టింది. ఆ తర్వాతి ఓవర్లో రిచా కూడా గేర్ మార్చింది. క్యాప్సీ వేసిన 16వ ఓవర్లో రిచా.. 4, 6, 4 బాదింది. ఈ ఓవర్లో 17 పరుగులొచ్చాయి. ఇక తారా నోరిస్ వేసిన 17వ ఓవర్లో రిచా ఓ సిక్సర్ బాదగా పెర్రీ రెండు సిక్సర్లు కొట్టింది. ఆ ఓవర్లో చివరి బంతికి సిక్సర్ కొట్టడంతో పెర్రీ హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. మొత్తంగా ఆ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. జొనాసేన్ వేసిన 18వ ఓవర్లో కూడా పెర్రీ ఒక సిక్స్.. రిచా ఓ ఫోర్, సిక్స్ కొట్టింది. 

కానీ శిఖా పాండే వేసిన 19వ ఓవర్లో రెండో బంతికి స్కూప్ షాట్ ఆడబోయిన రిచా.. వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత నాలుగు బంతుల్లో రెండు పరుగులే వచ్చాయి. ఇక జొనాసేన్ వేసిన చివరి ఓవర్లో తొలి బంతికి భారీ సిక్సర్ బాదింది. కానీ తర్వాతి ఐదు బంతుల్లో ఐదు పరుగులే వచ్చాయి. ఫలితంగా ఆర్సీబీ 150 పరుగుల మార్కును చేరుకుంది.