బతుకు తెరువు కోసం కూలీగా మారిన క్రికెటర్... వరల్డ్కప్ విన్నింగ్ హీరోకి...
2018 బ్లైండ్ క్రికెట్ వరల్డ్కప్లో భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ నరేష్ తుండకి ఆర్థిక కష్టాలు... కనికరించని ప్రభుత్వం, బతుకు తెరువు కోసం రోజూ కూలీపనులు చేస్తున్న దివ్యాంగ క్రికెటర్...
ఇండియాలో క్రికెట్కి ఉండే క్రేజ్ మరీ క్రీడకీ ఉండదు. క్రికెటర్గా నిరూపించుకుంటే చాలు, ఐపీఎల్, మ్యాచ్ ఫీజు, కాంట్రాక్ట్, స్పాన్సర్లు, ప్రకటనలు... ఇలా కోట్లల్లో, చిన్న క్రికెటర్ అయితే కనీసం లక్షల్లో అయినా సంపాదించేయొచ్చు. అయితే అందరి పరిస్థితి అలా ఉండదు.
వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఓ క్రికెటర్, బతుకు తెరువు కోసం కూలీ పని చేస్తున్నాడంటే నమ్మగలరా? అవును... ఇది నిజం. ఎందుకంటే అతను సాధారణ క్రికెటర్ కాదు... అసాధారణ బ్లైండ్ క్రికెటర్. గుజరాత్ రాష్ట్రానికి చెందిన నరేష్ తుండ, 2018 బ్లైండ్ క్రికెట్ వరల్డ్కప్లో భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు.
మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఫార్మాట్ వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను ఓడించి, టైటిల్ సాధించింది భారత జట్టు. అయితే ఆ తర్వాత కూడా నరేష్ తుండకి పెద్దగా అవకాశాలు రాలేదు. దివ్యాంగుల కోటా, స్పోర్ట్స్ కోటా కింద ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా... ఈ క్రికెటర్ను ఎవ్వరూ పట్టించుకోలేదు.
దీంతో బతుకు తెరువు కోసం రోజూ కూలీగా మారిన నరేష్... రోజూ వచ్చే 250 రూపాయలతో పొట్టపోసుకుంటున్నాడట. ‘రోజు కూలీ ద్వారా రూ.250 సంపాదిస్తున్నా. ముఖ్యమంత్రిని ఉద్యోగం కోసం మూడుసార్లు రిక్వెస్ట్ చేశా, కానీ ఆయన నుంచి రిప్లై మాత్రం రాలేదు. ప్రభుత్వం కనీకరించి ఏదైనా ఉద్యోగం ఇస్తే, నా కుటుంబాన్ని పోషించుకుంటా...’ అంటూ కామెంట్ చేశాడు నరేష్ .