WI vs IND ODI: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న యువ భారత జట్టు పూరన్ సేనను వణికించింది. బుధవారం విండీస్ తో జరిగిన మూడో వన్డేలో 119 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు వన్డేలను క్లీన్ స్వీప్ చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో ధావన్ సేన.. 119 పరుగుల తేడా (డక్వర్త్ లూయిస్ విధానంలో)తో విజయం సాధించింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించచిన ఈ మ్యాచ్ ను 36 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగుుల చేసింది. భారత్ తరఫున శుభమన్ గిల్ (98 నాటౌట్), శిఖర్ ధావన్ (58) రాణించారు. అనంతరం విండీస్ 26 ఓవవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్ జట్టులో నికోలస్ పూరన్ (42) టాప్ స్కోరర్. భారత బౌలర్ యుజ్వేంద్ర చాహల్ కు నాలుగు వికెట్లు దక్కాయి.
భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. జోరుమీదున్న కైల్ మేయర్స్, బ్రూక్స్ లను సిరాజ్ పరుగులేమీ చేయకుండానే వెనక్కిపంపాడు. స్కోరుబోర్డుపై పరుగులేమీ చేరకుండానే విండీస్ రెండు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అయితే బ్రాండన్ కింగ్ (42) తో కలిసి జట్టును ఆదుకునే యత్నం చేసిన షై హోప్ (22)ను చాహల్.. ఇన్నింగ్స్ 9.5 ఓవర్లో ఔట్ చేశాడు. అనంతరం బ్రాండన్ ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. కాసేపు ప్రతిఘటించిన నికోలస్ పూరన్ ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత వెస్టిండీస్ ఇన్నింగ్స్ లో చెప్పుకోవడానికి ఏమీలేదు.
103కు ఐదు వికెట్లు కోల్పోయిన విండీస్.. 137 కు ఆలౌటైంది. 30 పరుగుల వ్యవధిలోనే చాహల్, శార్దూల్ ఠాకూర్ (2 వికెట్లు) కలిసి విండీస్ ను ఆలౌట్ చేశారు. భారత బౌలర్ల దూకుడుకు విండీస్ జట్టులో నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. నలుగురు బ్యాటర్లు డకౌట్ అవగా.. ముగ్గురు పది కంటే తక్కువ పరుగులే చేసి వెనుదిరిగారు. ఫలితంతా విండీస్ దారుణ పరాజయం మూటగట్టుకుంది.
ఇక ఈ మ్యాచ్ తో పాటు సిరీస్ లో కూడా మెరుగ్గా రాణించిన టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు సిరీస్ అవార్డు కూడా దక్కింది. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ను 3-0తో గెలుచుకున్న భారత జట్టు.. శుక్రవారం నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది.
