Duleep Trophy: దేశవాళీ క్రికెట్ లో  భాగంగా ఈనెల 28 నుంచి జులై 12 వరకు  బెంగళూరు వేదికగా దులీప్ ట్రోఫీ  జరుగనుంది. ఈ నేపథ్యంలో కేరళ వెటరన్ ఆల్ రౌండర్ ‌కు చోటు దక్కకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

బీసీసీఐ దేశవాళీగా నిర్వహించే టోర్నీలలో దులీప్ ట్రోఫీ అత్యంత కీలకం. సాధారణంగా రంజీ సీజన్లలో బాగా ఆడిన ఆటగాళ్లను జోన్‌లు ఎంపిక చేస్తాయి. కానీ గత రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసి బ్యాటింగ్ చేయగల సమర్థుడైన వెటరన్ క్రికెటర్ జలజ్ సక్సేనా ఘాటుగా స్పందించాడు. రంజీ ట్రోఫీ 2022 - 23 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నప్పటికీ తనను సౌత్ జోన్ జట్టులో ఎంపిక చేయకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని బహిరంగంగానే ప్రశ్నించాడు. 

మధ్యప్రదేశ్ కు చెందిన సక్సేనా.. దేశవాళీలో కేరళ తరఫున ఆడుతున్నాడు. రంజీ 2022 - 23 సీజన్ లో అతడు ఏడు మ్యాచ్ లలోనే 50 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో అతడి ఎకానమీ 2.75గానే ఉండటం విశేషం. ఓ ఇన్నింగ్స్ లో అతడి అత్యుత్తమ ప్రదర్శన 8-36గా ఉంది. 

కాగా జూన్ 28 నుంచి జులై 12 వరకూ బెంగళూరు వేదికగా జరుగబోయే దులీప్ ట్రోఫీలో భాగంగా సౌత్ జోన్ ఇటీవలే విడుదల చేసిన జట్టులో సక్సేనా పేరు లేదు. దీనిపై అతడు కాస్త ఘాటుగానే స్పందించాడు. ట్విటర్ వేదికగా సక్సేనా స్పందిస్తూ.. ‘గతేడాది రంజీట్రోఫీ (ఎలైట్ గ్రూప్) లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ దులీప్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ లో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందో చెక్ చేసి చెప్తారా..? ఇది నేను కేవలం తెలుసుకోవాలనే ప్రయత్నంలో మాత్రమే ఇలా చెబుతున్నా.. ఎవర్నీ బ్లెయిమ్ చేయడానికి కాదు..’అని ట్వీట్ చేశాడు. 

Scroll to load tweet…

జలజ్ సక్సేనా స్పిన్న్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా రాణించగలడు. ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 133 మ్యాచ్ లు ఆడిన సక్సేనా.. 14 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీల సాయంతో 6,567 పరుగులు చేశాడు. ఆఫ్ స్పిన్నర్ అయిన జలజ్.. 410 వికెట్లు కూడా పడగొట్టి ఆల్ రౌండ్ ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. జలజ్ ను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా సెలక్టర్లపై మండిపడ్డాడు 

సౌత్ జోన్ జట్టు ఎంపికపై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా స్పందించాడు. తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ బాబా ఇంద్రజీత్ ను ఎంపిక చేయకపోవడంపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అసలు ఈ రోజుల్లో సెలక్షన్ కమిటీ ఎలా ఎంపిక చేస్తుందో నాకైతే అర్థం కావడంలేదు. 2023 మార్చిలో అతడు రెస్టాఫ్ ఇండియా తరఫున మధ్యప్రదేశ్ కు వ్యతిరేకంగా ఆడాడు. అప్పట్నుంచి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లే లేవు. కానీ అతడు సౌత్ జోన్ కు ఎంపిక కాలేదు. ఎవరైనా ఇలా ఎందుకు చేశారో చెప్పగలరా..’ అని ట్వీట్ చేశాడు. 

దులీప్ ట్రోఫీకి సౌత్ జోన్ జట్టు : హనుమా విహారి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రికీ భుయ్, కెఎస్ భరత్, ఆర్. సమర్థ, వాషింగ్టన్ సుందర్, సచిన్ బేబీ, ప్రదోశ్ రంజన్ పాల్, సాయి కిషోర్, వి.కవరెప్ప, వి.వైశాఖ్, కెవి శశికాంత్, దర్శన్ మిసాల్, తిలక్ వర్మ