‘ఇంత మాత్రానికి రంజీలు, దేశవాళీ ఆడించడం దేనికి..? ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లే పెట్టి సెలెక్ట్ చేసుకోండి..’
త్వరలో విండీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా సెలక్షన్ పై వెటరన్ క్రికెటర్, దేశవాళీలో తమిళనాడు తరఫున ఆడే అభినవ్ ముకుంద్ ఆసక్తికరంగా స్పందించాడు.
వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో భారత జట్టు కరేబియన్ టీమ్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ మేరకు రెండ్రోజుల క్రితం ఆలిండియా సెలక్షన్ కమిటీ రెండు ఫార్మాట్లకు జట్టును ప్రకటించింది. అయితే టెస్టు జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవాళీలో అదరగొడుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ను మరోసారి పట్టించుకోలేదు. ఐపీఎల్- 16 లో ఆడిన రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లకు టీమ్ లో చోటు దక్కింది. పుజారాను తప్పించడం కూడా విమర్శలకు దారి తీసింది.
తాజాగా టీమిండియా సెలక్షన్ పై వెటరన్ క్రికెటర్, దేశవాళీలో తమిళనాడు తరఫున ఆడే అభినవ్ ముకుంద్ ఆసక్తికరంగా స్పందించాడు. అసలు టీమిండియా సెలక్షన్ క్రైటీరియా ఏంటో అర్థం కావడం లేదని.. ఫ్రాంచైజీ క్రికెట్ నే బేస్ చేసుకుని ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారని ట్వీట్ చేశాడు.
ముకుంద్ స్పందిస్తూ.. ‘అసలు సెలక్షన్ ప్రక్రియ దేని ఆధారంగా జరుగుతుందో అర్థం కావడం లేదు. నాకు భిన్న ఆలోచనలు వస్తున్నాయి. ఒక యంగ్ క్రికెటర్ తన రాష్ట్ర జట్టు తరఫున దేశవాళీ ఆడినందుకు అతడికి దక్కే గౌరవం ఏంటి..? అంటే ఫ్రాంచైజీ క్రికెట్ లో ఆడి అక్కడ సక్సెస్ అయితేనే జాతీయ జట్టులోకి రావడానికి అర్హులా..? ఇదే గ్రేడ్ ను పాటిస్తున్నారా..?’ అని ట్వీట్ చేశాడు.
ముకుంద్ చేసిన ఈ ట్వీట్ కు క్రికెట్ ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. ‘అవును. ప్రస్తుతం టీమ్ సెలక్షన్ చూస్తే అదే అనిపిస్తోంది. ఈ విషయంలో రంజీలు, దేశవాళీలో ఇతర టోర్నీలు ఆడేవాళ్లు కూడా వాళ్ల కెరీర్ పై పునరాలోచించుకుకుంటే మంచిది. తమ రాష్ట్రం తరఫునో, జోన్ తరఫునో ఆడటం కంటే ఏదైనా ఒక ఫ్రాంచైజీకి ఆడుతూ అక్కడ ఓ రెండు సీజన్లు సక్సెస్ అయితే ఇక ఫ్యూచర్ కు ఢోకా లేనట్టే.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు వస్తాయి’అని కామెంట్స్ చేస్తున్నారు.
సర్ఫరాజ్ ఖాన్ ను టీమ్ లోకి తీసుకోకపోవడంపై కూడా టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ సెలక్టర్లపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు రంజీ సీజన్లలో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ను పక్కనబెట్టడం కరెక్ట్ కాదని ఆయన వాపోయాడు.