WTC Finals: భారత్ - ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా  గురువారం నుంచి  సిరీస్ లో కీలకమైన నాలుగో టెస్టు జరుగనుంది. ఈ  టెస్టు నెగ్గడం  భారత్ కు అత్యావశ్యకం..  

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ ల సిరీస్ ఆడుతున్న భారత జట్టు ఇప్పటికే ఈ సిరీస్ లో 2-1 తే ఆధిక్యంలో ఉంది. సిరీస్ విజేతను నిర్ణయించే నాలుగో టెస్టు అహ్మదాబాద్ వేదికగా ఈనెల 9 నుంచి మొదలుకానుంది. గురువారం నుంచి మొదలుకాబోయే ఈ టెస్టులో నెగ్గడం భారత్ కు సిరీస్ గెలుపునకే కాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోణంలో కూడా చాలా కీలకం. మరి ఈ మ్యాచ్ లో భారత్ ఓడినా.. డ్రా అయినా భారత్ ఫైనల్ చేరే అవకాశాలు ఎలా ఉంటాయి..?

అహ్మదాబాద్ టెస్టులో గెలిస్తే మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా రోహిత్ సేన.. జూన్ లో ఇంగ్లాండ్ వేదికగా జరుగబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. కానీ ఓడినా, డ్రా అయినా.. అదే క్రమంలో శ్రీలంక న్యూజిలాండ్ ను తొలి టెస్టులో ఓడించినా భారత్ కు కష్టకాలమే.. 

పాయింట్లు ఇలా.. 

ఇండోర్ టెస్టులో భారత్ ను ఓడించడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీలో ఇదివరకే తమ బెర్త్ ను ఖాయం చేసుకుంది. ఆ తర్వాత రేసులో ఇండియా, శ్రీలంక లు ఉన్నాయి. భారత్.. 17 టెస్టులలో 10 విజయాలు ఐదు ఓటములతో 123 పాయింట్లు సాధించి ఫైనల్ చేరేందుకు 60.29 శాతం అవకాశాలతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక.. 10 టెస్టులలో ఐదు గెలిచి నాలుగు ఓడి 64 పాయింట్లు సాధించి ఫైనల్ కు వెళ్లడానికి 53.33 శాతం ఛాన్స్ తో ఉంది. 

భారత్ ఫైనల్ చేరాలంటే.. 

- అహ్మదాబాద్ టెస్టు గెలిస్తే మిగతా సమీకరణాలేమీ అవసరం లేకుండా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవచ్చు. 
- ఒకవేళ ఈ టెస్టులో ఓడినా, డ్రా అయినా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ పాయింట్స్ పర్సంటేజ్ 52.9కు పడిపోతుంది. కానీ అయినా ఫైనల్ చేరొచ్చు. 
- ఈ పరిస్థితుల్లో న్యూజిలాండ్.. సిరీస్ ను వైట్ వాష్ (రెండు టెస్టులు) కాకుండా చూసుకోవాలి. ఒక్క టెస్టు మాత్రమే శ్రీలంక గెలిచి మరొకటి డ్రా అయినా భారత్ ఫైనల్ చేరుతుంది. 

శ్రీలంక ఫైనల్ ఛాన్సెస్.. 

- ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత్ ఓడిపోవాలి లేదా మ్యాచ్ డ్రా కావాలి. 
- భారత్ ఓడితే శ్రీలంక న్యూజిలాండ్ పై టెస్టు సిరీస్ గెలిస్తే (1-0తో అయినా అవకాశాలుంటాయి) చాలు. 
- ఒకవేళ భారత్ మ్యాచ్ ను డ్రా చేసుకుంటే అప్పుడు శ్రీలంక.. న్యూజిలాండ్ ను 2-0తో ఓడించాలి. అప్పుడే ఫైనల్ చేరడానికి ఛాన్స్ ఉంటుంది. 

లంక అద్భుతాలేమీ చేయకుంటే భారత్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే లంక మ్యాచ్ లు ఆడేది న్యూజిలాండ్ గడ్డమీద.. ఇటీవల ఇంగ్లాండ్ మీద రెండో టెస్టును తీవ్ర ఉత్కంఠ లో కూడా ఏకాగ్రత కోల్పోకుండా గెలిచిన న్యూజిలాండ్ ను ఓడించడం లంకకు కత్తిమీద సామే. అయినా క్రికెట్ లో ఎప్పుడేమీ జరిగేది ఎవరూ చెప్పలేరు. కావున భారత్ ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడుకుండా అహ్మదాబాద్ లోనే లండన్ టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి రోహిత్ సేన ఏం చేసేనో..?