చాలామంది మ్యాచ్ విన్నర్లున్నారు.. వ్యక్తిగత ప్రదర్శన కోసమే ఆడేవాళ్లు మాకొద్దు: బాబర్పై వసీం షాకింగ్ కామెంట్స్
Pakistan Cricket: తమ జట్టుకు మ్యాచ్ విన్నర్లు చాలా మంది ఉన్నారని.. ఎవరో ఒకరి మీద జట్టు ఆధారపడదని, అదీ వ్యక్తిగత ప్రదర్శనల కోసం ఆడేవాళ్ల గురించి పట్టించుకోమని అంటున్నాడు ఇమాద్ వసీం.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ వ్యక్తిగత ప్రదర్శనల కోసమే తప్ప టీమ్ కోసం ఆడే ఆటగాడు కాదంటూ గతంలో ఆ దేశ మాజీ క్రికెటర్లు చాలా మంది విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్ వెటరన్ క్రికెటర్ ఇమాద్ వసీం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తమకు మ్యాచ్ విన్నర్లు చాలా మంది ఉన్నారని.. ఎవరో ఒకరి మీద జట్టు ఆధారపడదని అన్నాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సందర్భంగా ఇమాద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. బాబర్ పేరు ఎత్తకున్నా ఇమాద్ చేసిన వ్యాఖ్యలు బాబర్ గురించేనని పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ వాపోతున్నారు. బాబర్ - ఇమాద్ లు కలిసి పీఎస్ఎల్ లో కరాచీ కింగ్స్ తరఫున ఆడారు.
ఇమాద్ మాట్లాడుతూ... ‘మా టీమ్ (కరాచీ కింగ్స్) లో వ్యక్తిగత ప్రదర్శనల కోసం ఆడేవాళ్ల కంటే మ్యాచ్ విన్నర్లు చాలా మంది ఉన్నారు. ఈ ఏడాది మేం కచ్చితంగా మంచి ప్రదర్శనలిస్తాం...’అని చెప్పాడు. అయితే బాబర్ పేరు చెప్పకున్నా ఇమాద్ చెప్పింది బాబర్ గురించేనని పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. కరాచీ తరఫున ఆడినప్పుడు కూడా ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని గతంలో వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే బాబర్ ను టార్గెట్ గా చేసుకున్న ఇమాద్.. పై విధంగా వ్యాఖ్యానించి ఉంటాడని చెవులు కొరుక్కుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
బాబర్.. గతంలో కరాచీ కింగ్స్ తరఫున ఆడేవాడు. 2020 సీజన్ లో ఆ టీమ్ కు ట్రోఫీని కూడా అందజేశాడు. కానీ 2022 సీజన్ లో కరాచీ.. పది మ్యాచ్ లు ఆడి ఒక్కదాంట్లో మాత్రమే నెగ్గింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు కింది నుంచి తొలిస్థానంలో నిలిచింది. జట్టు ఓటమితో పాటు టీమ్ మేనేజ్మెంట్ తో విభేదాల నేపథ్యంలో కరాచీ కింగ్స్ నుంచి బయటకు వచ్చాడు. ఈ సీజన్ నుంచి బాబర్.. పెషావర్ జల్మీ తరఫున ఆడనున్నాడు.
కరాచీ కింగ్స్.. బాబర్ స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ అయిన ఇమాద్ వసీంను నియమించుకుంది. ఇక ఇమాద్ గతంలో పాకిస్తతాన్ జాతీయ జట్టుకు ఆడాడు. 2017లో ఆ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమ్ ఇమాద్ సభ్యుడు.