గతేడాది టీ20 వరల్డ్ కప్ లో  భారత జట్టు సెమీస్ పరాజయం తర్వాత  టీ20లలో  కెప్టెన్ తో పాటు  హెడ్ కోచ్ ను కూడా మార్చాలని డిమాండ్లు వినిపించాయి. తాజాగా మళ్లీ అదే విధంగా.. 

వరుసగా రెండేండ్లు టీ20 ప్రపంచకప్ లలో వైఫల్యాలతో టీమ్ ను ప్రక్షాళన చేయాలని, జట్టులోకి యువ రక్తాన్ని ఎక్కించాలని కొద్దికాలంగా క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వయసు మీద పడ్డ రోహిత్ తో పాటు కోహ్లీ, రాహుల్, భువీ, షమీలను తప్పించి యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని అలాగే హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను టెస్టులు, వన్డేలకు పరిమితం చేసి టీ20లలో కొత్త కోచ్ ను తీసుకురావాలని సూచిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు ఇద్దరు సారథులు ఉన్నప్పుడు ఇద్దరు హెడ్ కోచ్ లు ఉంటే తప్పేంటని ప్రశ్నించాడు. రాహుల్ ద్రావిడ్ టీ20లకు సూట్ కాడని చెప్పాడు. 

ఓ జాతీయ పత్రికతో భజ్జీ మాట్లాడుతూ... ‘అవును. మనకు ఇద్దరు కెప్టెన్లున్నారు. ఇద్దరు హెడ్ కోచ్ లు ఉంటే తప్పేంటి..? ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆ ఫార్ములాతో సక్సెస్ అవుతోంది. ఇతర జట్లు కూడా దానిని అనుసరిస్తున్నాయి. టీ20లలో ఆశిష్ నెహ్రా గానీ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వారు గానీ హెడ్ కోచ్ గా ఉండాలి. టీ20 కాన్సెప్ట్ ను అర్థం చేసుకునేవారు, ఆట గురించి పరిపూర్ణ అవగాహన ఉన్నవారు ఈ ఫార్మాట్ కు హెడ్ కోచ్ గా ఉంటేనే జట్టుకు మంచిది... 

ఒకవేళ ఆశిష్ నెహ్రా టీమిండియా టీ20 టీమ్ కు కోచ్ గా ఉంటే అతడి ఫోకస్ అంతా ఈ ఫార్మాట్ లో జట్టును ఛాంపియన్ ఎలా చేయాలనేదానిమీదే ఉంటుంది. అప్పుడు రాహుల్ ద్రావిడ్.. టెస్టు, వన్డేలలో ఇండియాను నెంబర్ వన్ చేయాలనేదానిపై దృష్టి పెడతాడు...’ అని చెప్పాడు. 

ఇదీ చదవండి : రాజకీయాల్లోకి వచ్చేముందు సచిన్‌ను కలిశా.. లిటిల్ మాస్టర్ ఏం చెప్పాడంటే.. భజ్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇదిలాఉండగా గతేడాది టీ20 ప్రపంచకప్ వైఫల్యం తర్వాత భారత టీ20 జట్టులో పెనుమార్పులు చోటు చేసుకుంటున్న విషయం విదితమే. వచ్చే ఏడాది అమెరికాలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ.. హార్ధిక్ పాండ్యాకు పగ్గాలు అప్పజెప్పింది. సీనియర్లను అధికారికంగా ఈ ఫార్మాట్ నుంచి తప్పించకపోయినా జూనియర్లకే ఎక్కువ అవకాశాలిస్తూ వారినే ప్రోత్సహిస్తున్నారు. రోహిత్ శర్మ, కోహ్లీ, భువీ, షమీ, కెఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లను అసలు ఎంపిక చేయడం లేదు. ఇటీవల చేతన్ శర్మ లీక్డ్ వీడియోలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి భారత జట్టు ఇప్పట్లో టీ20లు ఆడదు. ఆస్ట్రేలియాతో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డే సిరీస్ ఆరంభమవుతుంది. అదీ ముగిశాక ఐపీఎల్ రెండు నెలల పాటు కొనసాగుతుంది. జూన్ లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఉంది. జులై - ఆగస్టు వరకూ టీమిండియా అంతర్జాతీయ స్థాయిలో టీ20లు ఆడదు. మరి ఆలోపు బీసీసీఐ టీ20లలో ఇద్దరు కోచ్ లపై ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా..? లేక ద్రావిడ్ నే కొనసాగిస్తుందా..? అనేది తేలాల్సి ఉంది.