2011లో భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో  సచిన్ తో పాటు భజ్జీ కూడా ఉన్నాడు.  తాజాగా  హర్భజన్..  తనకు సచిన్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ ఇద్దరూ కలిసి చాలాకాలం పాటు క్రికెట్ ఆడారు. 2011లో భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సచిన్ తో పాటు భజ్జీ కూడా ఉన్నాడు. తాజాగా హర్భజన్.. తనకు సచిన్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి, తాను రాజకీయాల్లోకి వచ్చే ముందు కూడా సచిన్ చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నాడు. 

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో హర్భజన్ మాట్లాడుతూ.. ‘నేను పాజీ (సచిన్) ను చాలా గౌరవిస్తాను. సచిన్ తో నాకు ప్రొఫెషనల్ గానే గాక వ్యక్తిగతంగా కూడా మంచి అనుబంధముంది. మేమిద్దరం చాలా క్లోజ్. టెండూల్కర్ ను కలవడమంటే నాకు చాలా ఇష్టం. నా కంపెనీని కూడా సచిన్ అంతే ఇష్టపడతాడని అనుకుంటున్నా... 

నేను పంజాబీలో మాట్లాడితే సచిన్ కు చాలా ఇష్టం. నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆయనకు కాల్ చేస్తా. సలహాలు తీసుకుంటా. నేను రాజకీయాల్లో రావడానికి ముందు కూడా సచిన్ ను కలిసి మాట్లాడా. అప్పుడు సచిన్ నాతో ఓ మాట చెప్పాడు.. ‘దేశానికి సేవ చేసే అవకాశం వస్తే నేనైతే వదులుకోను..’అని అన్నాడు. నాకు కూడా అది మంచి సలహాగానే అనిపించి రాజ్యసభకు వెళ్లా. ప్రస్తుతం ఇది నా కొత్త ఇన్నింగ్స్. ఎన్నిరోజులు ఇది కొనసాగుతుందో తెలియదు. కానీ నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా..’అని చెప్పాడు. 

హర్భజన్ 2021లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత అతడు 2022లో రాజకీయాల్లోకి వచ్చాడు. గతేడాది భజ్జీ.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యాడు. గతేడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా భజ్జీ.. ప్రమాణస్వీకారం చేశాడు. భజ్జీ కంటే ముందే సచిన్.. 2012లో రాజ్యసభ (కాంగ్రెస్) ఎంపీగా పనిచేసిన విషయం తెలిసిందే. 

ఇక భారత జట్టు తరఫున 1998 నుంచి 2016 వరకు ఆడిన హర్భజన్.. 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ0లలో ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 707 వికెట్లు తీశాడు. భారత జట్టు 2007లో గెలిచిన టీ20 ప్రపంచకప్ తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.