సరదా కోసం కాదు.. క్రికెట్ ఆడటానికి వచ్చాం.. కోహ్లీ
ఈ ఐపీఎల్ సీజన్ సవ్యంగా జరిగేందుకు ‘బయో సెక్యూర్ బబుల్’ నిబంధనలు అనుసరించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కోహ్లీ పేర్కొన్నారు.అన్నీ మరచి ఆటపైనే దృష్టి పెట్టాలని అతను తన జట్టు సభ్యులకు సూచించాడు.
సరదాగా గడిపేందుకు దుబాయ్ రాలేదని.. ఆ విషయాన్ని ఆటగాళ్లు గుర్తించాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. ప్రస్తుతం క్రికెటర్లంతా.. ఐపీఎల్ 2020 కోసం దుబాయి వెళ్లిన సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ ఐపీఎల్ సీజన్ సవ్యంగా జరిగేందుకు ‘బయో సెక్యూర్ బబుల్’ నిబంధనలు అనుసరించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కోహ్లీ పేర్కొన్నారు.అన్నీ మరచి ఆటపైనే దృష్టి పెట్టాలని అతను తన జట్టు సభ్యులకు సూచించాడు.
‘మేమందరం ఇక్కడ క్రికెట్ ఆడటానికి వచ్చాం. టోర్నమెంట్ సాఫీగా సాగాలంటే ప్రతీ ఒక్కరు బయో బబుల్ నిబంధనలు గౌరవించాల్సిందే. ఏదో సరదాగా గడిపేందుకు మనం రాలేదు. నేను హాయిగా దుబాయ్ వీక్షించి వస్తానంటే కుదరదు. అంత గొప్ప పరిస్థితుల్లో మనం ప్రస్తుతం లేము. ఎలాంటి దశను దాటుతున్నామో అర్థం చేసుకోవాలి. ఒక రకంగా మనం అదృష్టవంతులం. ఇంత కఠోర పరిస్థితుల్లోనూ ఐపీఎల్ ఆడే అవకాశం లభించింది. ఇతర పరిస్థితులు మనల్ని నియంత్రించేలా వ్యవహరించవద్దు’ అని కోహ్లి తన సహచరులకు ఉద్బోధ చేశాడు.
బహుశా చాలా ఏళ్లుగా విరామం లేకుండా ఆడుతుండటం వల్ల ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్నా తనకు ఎలాంటి ఇబ్బందీ అనిపించలేదని కోహ్లి అన్నాడు. రెండు నెలల క్రితం అసలు ఐపీఎల్ జరిగే అవకాశం లేదని భావించామని... ఇప్పుడు మళ్లీ లీగ్లో ఒక్క చోట చేరడం సంతోషంగా ఉందని అతను అభిప్రాయ పడ్డాడు.