ICC: 2022లో ఐసీసీ మేటి టీ20 జట్టు ఇదే.. టీమ్లో ముగ్గురు టీమిండియా క్రికెటర్లే..
ICC: గతేడాది పలు అంతర్జాతీయ జట్లు అద్భుతమైన ప్రదర్శనలతో క్రికెట్ ప్రేమికులను అలరించాయి. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం అంచనాలకు మించి రాణించారు. వారితో ఐసీసీ మేటి జట్టును ఎంపికచేసింది.
2022కు సంబంధించి మేటి టీ20 జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. పలు టీమ్ల నుంచి అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన 11 మంది ఆటగాళ్లను ఏరికోరి ఈ జట్టును ఎంపికచేసింది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్ రౌండర్లతో కూడిన ఈ జట్టుకు గతేడాది ఇంగ్లాండ్ కు రెండో టీ20 ప్రపంచకప్ అందించిన జోస్ బట్లర్ను సారథిగా ఎంచుకుంది. ఈ టీమ్ లో భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లు ఉండటం గమనార్హం. అగ్రశ్రేణి జట్లు, ఆటగాళ్లు ఉన్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం.
ఐసీసీ సోమవారం ప్రకటించిన జోస్ బట్లర్ సారథ్యంలోని ఈ జట్టులో భారత్ నుంచి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, టీ20లలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాలు చోటు దక్కించుకున్నారు. భారత్ నుంచి ముగ్గురు చోటు దక్కించుకోగా పాకిస్తాన్ నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ తో పాటు బౌలర్ హరీస్ రౌఫ్ కూడా ఉన్నాడు.
ఇక టీమ్ లో బట్లర్, రిజ్వాన్ లు ఓపెనర్లు కాగా మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. టీమిండియాలో మాదిరిగానే ఇక్కడ కూడా సూర్యకు తనకు ఇష్టమైన నాలుగో స్థానమే దక్కింది. ఐదో స్థానంలో కివీస్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కు చోటు దక్కగా.. ఆ తర్వాత జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా, హార్ధిక్ పాండ్యా (ఇండియా), ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ఉన్నారు. స్పిన్నర్ల కోటాలో వనిందు హసరంగ ఉండగా పేసర్లుగా హరీస్ రౌఫ్, జోష్ లిటిల్ (ఐర్లాండ్) లు ఉన్నారు.
కాగా గతేడాది ఆగస్టు వరకు పేలవ ఫామ్ తో ఫార్మాట్ తో సంబంధం లేకుండా విఫలమై ఒకదశలో చోటు కూడా దక్కించుకోలేడేమో అనిపించిన కోహ్లీ తర్వాత పుంజుకుని ఐసీసీ మేటి టీమ్ లో చోటు దక్కించుకోవడం గమనార్హం. ఆసియా కప్ లో రీఎంట్రీ ఇచ్చిన కింగ్.. ఆ టోర్నీతో పాటు టీ20 ప్రపంచకప్ లో కూడా హయ్యస్ట్ రన్స్ స్కోరర్ అయ్యాడు.
ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఈయర్ : జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, సికందర్ రజా, హార్థిక్ పాండ్యా, సామ్ కరన్, వనిందు హసరంగ, హరీస్ రౌఫ్, జోష్ లిటిల్