విరాట్ కోహ్లీకి యో-యో టెస్టులో 17.2 పాయింట్లు... నేటి నుంచి ఆసియా కప్ 2023 టోర్నీ కోసం బెంగళూరులో బీసీసీఐ స్పెషల్ క్యాంపు.. 

వెస్టిండీస్ టూర్‌లో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి వచ్చేశాడు విరాట్ కోహ్లీ. అటు నుంచి యూఎస్‌ఏ వెళ్లి, క్రికెట్ అకాడమీని ప్రారంభించిన రోహిత్ శర్మ కూడా స్వదేశానికి వచ్చాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగించుకున్న తర్వాత హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్ అండ్ కో కూడా భారత్‌కి చేరుకున్నారు..

ప్రస్తుతం వీళ్లంతా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ పరీక్షల్లో పాల్గొంటున్నారు. ఐర్లాండ్ టూర్‌లో మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో టీమిండియా ప్లేయర్లు జస్ప్రిత్ బుమ్రా, సంజూ శాంసన్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా నేరుగా బెంగళూరులోకి చేరుకుని, ఎన్‌సీఏ క్యాంపులో పాల్గొంటారు..

ఆగస్టు 29 వరకూ బీసీసీఐ క్యాంపులో పాల్గొనే భారత జట్టు, అదే రోజు రాత్రి శ్రీలంకకు బయలుదేరి వెళ్తుంది. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభం అవుతోంది. అయితే టీమిండియా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో జరగనుంది. కాబట్టి ఆసియా కప్‌కి ముందు లంక పిచ్ పరిస్థితులకు అలవాటు పడడానికి వీలుగా 3 రోజుల పాటు ప్రాక్టీస్‌కి సమయం దొరుకుతుంది..

తాజాగా ఎన్‌సీఏలో జరిగిన యో-యో ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయినట్టు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇన్‌స్టా స్టేటస్‌లో పెట్టిన వివరాల ప్రకారం విరాట్ కోహ్లీకి యో-యో టెస్టులో 17.2 పాయింట్లు వచ్చాయి. ‘భయంకరమైన శంఖాల మధ్య ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసినప్పుడు కలిగే ఆనందమే వేరుగా ఉంటుంది..’ అంటూ కాప్షన్ జోడించాడు విరాట్ కోహ్లీ..

అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, 76 అంతర్జాతీయ సెంచరీలతో సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆసియా కప్ 2023 టోర్నీలో, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల్లో విరాట్ కోహ్లీ, టీమిండియాకి కీ ప్లేయర్‌గా మారబోతున్నాడు. 

టీమిండియాలో ఫిట్టెస్ట్ క్రికెటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేయడంలో పెద్ద విశేషమేమీ లేదు. అయితే టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శార్దూల్ ఠాకూర్ వంటి ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై ఎప్పటినుంచో అనుమానాలు ఉన్నాయి. కెఎల్ రాహుల్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని బీసీసీఐ ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు..

గాయం కారణంగా పాకిస్తాన్‌తో జరిగే మొదటి మ్యాచ్‌లో, ఆ తర్వాత నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లోనూ కెఎల్ రాహుల్ ఆడడం లేదు. అయితే సూపర్ 4 రౌండ్ సమయానికి కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే జాతీయ క్రికెట్ అకాడమీలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 199 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, సెలక్టర్ల అనుమానాలను క్లియర్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగానే శ్రేయాస్ అయ్యర్‌కి ఆసియా కప్ 2023 టోర్నీలో చోటు దక్కిందని సమాచారం.. 

హార్ధిక్ పాండ్యా