Dinesh Karthik Retirement: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్  అంతర్జాతీయ క్రికెట్  కు వీడ్కోలు పలుకబోతున్నాడా..? అతడు  షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోకు  అర్థమేమిటి..? 

భారత్ తరఫున తొలి టీ20 ప్రపంచకప్ ఆడి ఇటీవలే 8వ ఎడిషన్ ఆడిన ఇద్దరు ఆటగాళ్లలో ఒకడైన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడా..? తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కార్తీక్ షేర్ చేసిన ఓ వీడియో, రాసుకొచ్చిన కామెంట్స్ ఇందుకు ‘అవును’ అనే అనుమానాన్ని కలిగిస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించినట్టేనని కామెంట్స్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ లో సెమీస్ వైఫల్యం తర్వాతే భారత జట్టుకు ఇక ఆడటం కష్టమే అని భావించిన ఆటగాళ్లలో కార్తీక్ కూడా ఉండటంతో తాజాగా అతడి ఇన్స్టా పోస్ట్ కూడా ఇదే సమాధానం చెబుతున్నది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇన్స్టాలో కార్తీక్ స్పందిస్తూ.. ‘భారత జట్టు తరఫున ప్రపంచకప్ లో ఆడాలనే నా లక్ష్యం కోసం చాలా కష్టపడ్డాను. నా కల నెరివేరినందుకు సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో మేం టైటిల్ కొట్టలేకపోవచ్చు. కానీ ఎన్నో జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోతాయి.

ఈ క్రమంలో నాకు మద్దతుగా నిలిచిన సహచర ఆటగాళ్లకు, కోచ్ లు, అభిమానులకు ధన్యవాదాలు..’అని రాసుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ లో కార్తీక్ జర్నీకి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేగాక క్యాప్షన్ కింద కలలునిజమౌతాయి అనే హ్యాష్ ట్యాగ్ జతచేశాడు.

కార్తీక్ షేర్ చేసిన ఈ వీడియో, కామెంట్స్ తో ఫ్యాన్స్ కంగుతిన్నారు. కొంపదీసి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడా..? అని కార్తీక్ పోస్టుకు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు.

View post on Instagram

అయితే ఫ్యాన్స్ ఎంత సూచించినా కార్తీక్ కు జట్టులో చోటు దక్కడం కష్టమే. వచ్చే టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని కొత్త కుర్రాళ్లను ట్రై చేస్తున్న టీమ్ మేనేజ్మెంట్ దిగ్గజ క్రికెటర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలనే తమ కెరీర్ పై ఆలోచించుకోవాలని సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక అశ్విన్ కైతే మళ్లీ జట్టులో చోటు దక్కడంం గగనమే అని తేలిపోయింది. ఇంత కాంపిటీషన్ లో కార్తీక్ కు తుది జట్టులో చోటు దక్కడమంటే అది అత్యాశే అవుతుందనే వాదనా ఉంది. టీ20 ప్రపంచకప్ లో రిషభ్ పంత్ ను పక్కనబెట్టి మరీ కార్తీక్ ను ఆడించినా మూడు మ్యాచ్ లలో బ్యాటింగ్ వచ్చినా దానిని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో సెమీఫైనల్లో కార్తీక్ కు అవకాశం దక్కలేదు.

అంతర్జాతీయ స్థాయి నుంచి రిటైరైనా కార్తీక్ ఆటను ఐపీఎల్ లో ఆస్వాదించొచ్చు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ లో ఆర్సీబీ.. కార్తీక్ ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.కాగా టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే కార్తీక్ క్రిక్ బజ్ లో ఇండియా-న్యూజిలాండ్ సిరీస్ కు క్రికెట్ అనలైజర్ గా చేరి మ్యాచ్ విశ్లేషణ బాధ్యతలు ఎత్తుకోవడం గమనార్హం.