''కోహ్లీ పరుగుల దాహం...కేవలం వన్డేల్లోనే 80 సెంచరీలు''
కరీబియన్ గడ్డపై సెంచరీతో అదరగొట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ ఆటగాడు వసీం జాఫర్ కోహ్లీని ఆకాశానికెత్తేస్తూ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీల వేట మళ్లీ మొదలయ్యింది. ప్రపంచ కప్ టోర్నీలో అతడు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నా వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు. అయితే ఆ తప్పు వెస్టిండిస్ పర్యటనలో పునరావృతంకాకుండా చూసుకున్నాడు. విండీస్ తో జరిగిన రెండో వన్డేలో 120 పరుగులు బాది సత్తా చాటాడు. ఇలా కెరీర్లో 42వ వన్డే సెంచరీ సాధించిన కోహ్లీ 80 సెంచరీలు పూర్తిచేసుకోవడం ఖాయమని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.
భారత్-వెస్టిండిస్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ కోహ్లీ వీరోచితంగా పోరాడి సెంచరీ గురించి స్పందిస్తూ జాఫర్ ట్వీట్ చేశాడు. '' 11 ఇన్నింగ్సుల విరామం తర్వాత కోహ్లీ మళ్లీ తన సెంచరీల వేటను ప్రారంభించాడు. ఇలా వెస్టిండిస్ పై మరో అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. ఇక్కడితోనే అతడిని పరుగుల దాహం ఆగదు. నా అంచనా ప్రకారం అతడు కేవలం వన్డేల్లోనే 75-80 సెంచరీలు బాదడం ఖాయం.'' అంటూ కోహ్లీపై జాఫర్ ప్రశంసలు కురిపించాడు.
వెస్టిండీస్తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన రెండో వన్డేలో భారత్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్లో వర్షం అంతరాయం కలిగించినా డక్వర్త్లూయిస్ పద్ధతిలో భారత్ కు విజయం వరించింది. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ (31/4) విజృంభించడం, బ్యాటింగ్ లో కోహ్లీ 120, శ్రేయస్ అయ్యర్ 71పరుగులు బాది అదరగొట్టే ప్రదర్శనతో టీమిండియాను గెలిపించారు.