పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం.. క్రీడా మంత్రి అయిన వెటరన్ పేసర్.. బీపీఎల్ నుంచి వెళ్లాకే ప్రమాణ స్వీకారం..
Pakistan Crisis: ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థ క్షీణించిన దశలో షెహబాజ్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే దశకు చేరుకుంది. తాజాగా పాక్ ప్రభుత్వం.. వెటరన్ పేసర్ వహాబ్ రియాజ్ ను మంత్రిగా చేసింది.

ఆర్థిక సంక్షోభం అలుముకున్న పాకిస్తాన్ లో ప్రజల జీవనం నానాటికీ కష్టతరమవుతున్నది. నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్న వేళ ఆ దేశ ప్రధాని తీసుకుంటున్న కంటి తుడుపు చర్యలు ఏమంత ఆశజనకంగా లేవు. ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థ క్షీణించిన దశలో షెహబాజ్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే దశకు చేరుకుంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, కరెంట్ కోతలు, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా ఉన్న పంజాబ్ ప్రావిన్స్ లోని రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలోనే రద్దు చేసిన షెహబాజ్ ప్రభుత్వం.. అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వంలో పాకిస్తాన్ వెటరన్ పేసర్ వహాబ్ రియాజ్ కు కూడా మంత్రి పదవి లభించింది.
పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ బలిగ్ ఉర్ రెహ్మాన్.. తాత్కాలికంగా ఓ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంత్రివర్గంలో 8 మంది మంత్రులు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ క్రీడా శాఖ మంత్రిగా ఎంపికైన రియాజ్ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేదు. ప్రస్తుతం రియాజ్.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లో ఆడుతున్నాడు.
బీపీఎల్ లో ఖుల్నా టైగర్స్ తరఫున ఆడుతున్న రియాజ్.. నేడో రేపో పంజాబ్ ప్రావిన్స్ కు వెళ్లి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నాడు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు, మేథావులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కేవలం జాతీయ జట్టుకు ఆడినంత మాత్రానా ఎవర్నో ఒకరిని తీసుకొచ్చి మంత్రి పదవిగా నియమించడం కరెక్ట్ కాదని.. సంక్షోభం చుట్టుముడుతున్న వేళ ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వానికి చేటు చేస్తాయని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా 2008లో పాకిస్తాన్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రియాజ్.. ఇప్పటివరకు 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. టెస్టులలో 83 వికెట్లు, వన్డేలలో 120 వికెట్లు, టీ20లలో 38 వికెట్లు తీశాడు. 2018 నుంచి క్రమంగా పాకిస్తాన్ టీమ్ కు దూరమవుతున్న రియాజ్.. ఆ జట్టు తరఫున చివరిసారిగా 2020లో ఆడాడు. అనంతరం లీగ్ లకే పరిమితమైన ఈ లెఫ్టార్మ్ పేసర్.. వివిధ లీగ్ లలో 400 కు పైగా వికెట్లు తీశాడు.