జడేజా ట్వీట్.. తమిళ తంబీల రచ్చ.. ఐపీఎల్కు ముందే చెన్నై ఫ్యాన్స్కు పండుగ
గతేడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత జడేజా.. చెన్నై, సీఎస్కే యజమానులతో విభేదాలతో కారణంగా టీమ్ కు దూరంగా ఉన్నాడు. సీఎస్కే సోషల్ మీడియా ఖాతాల్లోంచి కూడా బయటకు వచ్చాడు. కానీ చాలా కాలం తర్వాత జడ్డూ మళ్లీ చెన్నైలో సందడి చేస్తున్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి మాసాంతంలో మొదలుకాబోతున్నది. ఈ మేరకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు మాత్రం ఐపీఎల్ కంటే ముందే పండుగ వచ్చింది. తమ అభిమాన ఆటగాడు, ఆ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గత కొన్నాళ్లుగా అసలు సీఎస్కేలో ఉంటాడా..? ఉండడా..? అన్న అనుమానాల నేపథ్యంలో తాజాగా జడ్డూ చేసిన ట్వీట్ తో తమిళ తంబీలు పండుగ చేసుకుంటున్నారు.
గతేడాది ఆసియాకప్ లో ఆడుతూ గాయంతో జట్టుకు దూరమైన జడేజా.. చాలా రోజుల తర్వాత తిరిగి జాతీయ జట్టుకు వచ్చాడు. ఆస్ట్రేలియాతో ఇది వరకే ప్రకటించిన తొలి రెండు టెస్టులకు జడేజా ఎంపికయ్యాడు. త్వరలోనే అతడు జాతీయ జట్టుకు ఆడనున్నాడు. అంతకంటే ముందు జడేజాను రంజీ మ్యాచ్ లు ఆడాలని బీసీసీఐ షరతు విధించింది.
ఈ నేపథ్యంలో జడేజా.. తాను గతంలో ప్రాతినిథ్యం వహించిన సౌరాష్ట్ర తరఫునే బరిలోకి దిగనున్నాడు. సౌరాష్ట్ర-తమిళనాడు మధ్య రేపటి నుంచి రంజీ ఫైనల్ సీజన్ మొదలుకాబోతున్నది. ఈ మ్యాచ్ ఆడేందుకు జడ్డూ చెన్నైకి వచ్చాడు. చెన్నైకి రాగానే జడేజా.. ‘వణక్కం చెన్నై’(నమస్కారం చెన్నై) అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గతేడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత జడేజా.. చెన్నై, సీఎస్కే యజమానులతో విభేదాలతో కారణంగా టీమ్ కు దూరంగా ఉన్నాడు. సీఎస్కే సోషల్ మీడియా ఖాతాల్లోంచి కూడా బయటకు వచ్చాడు. అందుకు సంబంధించిన పోస్టులను డిలీట్ చేశాడు. దీంతో ఇక నుంచి జడ్డూ.. సీఎస్కేకు ఆడలేడేమో అని అందరూ భావించారు.
చివరికి గతేడాది ముగిసిన ఐపీఎల్ మినీ వేలం ముందు ధోని జోక్యం చేసుకుని జడేజాను టీమ్ లోనే ఉండేలా ఒప్పించాడు. యాజమన్యం, జడేజా మధ్య విభేదాలను తొలగించి జడ్డూ సీఎస్కే తరఫునే ఉండేలా కృషి చేశాడు. మధ్యలో తన భార్య ఎన్నికల ప్రచారంలో పడి కాస్త బిజీ అయిన జడ్డూ.. చాలా కాలం తర్వాత మళ్లీ ఫీల్డ్ లోకి అడుగుపెట్టడమే గాక తనకు ఎంతో అనుబంధం ఉన్న చెన్నై అభిమానులను పలుకరించబోతున్నాడు. దీంతో అక్కడి అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘వెల్కమ్ బ్యాక్ జడేజా’ అని కామెంట్స్ పెడుతున్నారు.
ఓ అభిమాని ఇటీవలే ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత దిల్ రాజు వారసుడు తమిళ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పిన డైలాగ్ ను జడేజాకు మార్చి అతడికి స్వాగతం చెప్పాడు. అందులో.. ‘సిక్సెస్ వేనుమా సిక్స్ ఇరుక్కు.. వికెట్స్ వేనుమా వికెట్స్ ఇరుక్కు.. ఫీల్డింగ్ వేనుమా ఫీల్డింగ్ ఇరుక్కు.. టోటల్లీ జడ్డూ ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ ఇరుక్కు..’ అని చేసిన ట్వీట్ నవ్వులు పూయిస్తోంది.