ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్: ఢిల్లీ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 81 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచిన ఉస్మాన్ ఖవాజా... తొలి ఇన్నింగ్స్లో 1 పరుగు ఆధిక్యం దక్కినా దాన్ని వాడుకోలేకపోయిన ఆస్ట్రేలియా..
టెస్టుల్లో నెం.1 టీమ్గా భారత్లో అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగిన మొదటి రెండు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా ఆటతీరు ఆ రేంజ్లో లేదు. తొలి టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాలో ఓడిన ఆస్ట్రేలియా, ఢిల్లీ టెస్టులో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది..
నాగ్పూర్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులకి ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా, ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 113 పరుగులకే చాపచుట్టేసింది. నాగ్పూర్ టెస్టులో ఆసీస్ బ్యాటర్లు ఎవ్వరూ హాఫ్ సెంచరీ మార్కు అందుకోలేకపోయారు. అయితే ఢిల్లీ టెస్టులో కాస్త బెటర్ పర్ఫామెన్సే ఇచ్చింది ఆస్ట్రేలియా...
ఉస్మాన్ ఖవాజా 81 పరుగులు చేయగా పీటర్ హ్యాండ్స్కోంబ్ 72 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా, 12 ఓవర్లలో 61 పరుగులు చేసి భారత బౌలర్లను ప్రెషర్లోకి నెట్టేసింది. అయితే మూడో రోజు ఉదయం సెషన్లో ఈ ప్లాన్ని సరిగ్గా అమలు చేయడంలో ఫెయిలై, వెంటవెంటనే 9 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యింది..
‘ఢిల్లీ టెస్టు మేం సరైన ప్లాన్తోనే బరిలో దిగాం. అయితే వాటిని అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం. టీమిండియా పరిస్థితులను చక్కగా వాడుకుంది. మూడో రోజు తొలి సెషన్లో మాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది..
సరైన ఒక్క భాగస్వామ్యాన్ని నిర్మించలేకపోయాం. మూడో రోజు మొదటి సెషన్ని చాలా పాజిటివ్గా మొదలెట్టాలని అనుకున్నాం. వేగంగా పరుగులు చేశాం, అదే స్టైల్లో ఆడితే మ్యాచ్ మాదేననే నమ్మకం కూడా ఉండింది...
రెండో ఇన్నింగ్స్లో 180 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ మాదే. అయితే భారత బౌలర్లు మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వచ్చిన అవకాశాలను మేం చేజార్చుకున్నాం....’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా...
తొలి ఇన్నింగ్స్లో 125 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్తో 81 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, రవీంద్ర జడేజా బౌలింగ్లో కెఎల్ రాహుల్ పట్టిన అద్భుతమైన క్యాచ్కి పెవిలియన్ చేరాడు. రెండో ఇన్నింగ్స్లో 13 బంతుల్లో ఓ ఫోర్తో 6 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, రవీంద్ర జడేజా బౌలింగ్లోనే శ్రేయాస్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
రెండో ఇన్నింగ్స్లో 23 పరుగుల తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతున్నట్టు కనిపించింది. అయితే 46 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్తో 43 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ని, మూడో రోజు మొదటి ఓవర్ ఆఖరి బంతికి అవుట్ చేసిన అశ్విన్... స్టీవ్ స్మిత్ని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వెంటవెంట వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా, గంటన్నరలో 56 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయిపోయింది..
తొలి ఇన్నింగ్స్లో 1 పరుగు ఆధిక్యం దక్కించుకున్న ఆస్ట్రేలియా, 115 పరుగుల టార్గెట్ని టీమిండియా ముందు పెట్టింది. 4 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు, 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.
