U19 Asia Cup 2021-22: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో భారత అండర్-19 టీమ్ ఘన విజయం... రికార్డు స్థాయిలో 8వ సారి టైటిల్ కైవసం...

అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పటికే ఏడుసార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత్ అండర్- 19 టీమ్‌కి ఇది 8వ టైటిల్. ఇప్పటిదాకా 9 సార్లు టోర్నీ నిర్వహిస్తే, అందులో భారత జట్టు 8 సార్లు టైటిల్ గెలవగా, 2017లో పాకిస్తాన్‌ను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 ఆసియా కప్ గెలిచింది.

శ్రీలంక విధించిన 102 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత జట్టుకి శుభారంభం దక్కలేదు. హర్నూర్ సింగ్ 13 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి యషిరు రోడ్రిగో బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...

Read: రోహిత్ శర్మ, రిషబ్ పంత్, అశ్విన్, అక్షర్ పటేల్... క్రికెట్ ఆస్ట్రేలియా 2021 టెస్టు టీమ్‌ ఎలెవన్‌లో...

అయితే అంగ్‌క్రిష్ రఘువంశీ, షేక్ రషీద్ కలిసి రెండో వికెట్‌కి 96 పరుగుల అజేయ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరూ వరుస విరామాల్లో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అంగ్‌క్రిష్ రఘువంశీ 64 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు..

రఘువంశీ 67 బంతుల్లో 7 ఫోర్లతో 56 పరుగులు చేయగా, షేక్ రషీద్ 49 బంతుల్లో 2 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. అంతకుముందు శ్రీలంక జట్టు, భారత జట్టు ముందు 102 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు,38 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేయగలిగింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌కి అంతరాయం కలగడంతో టీమిండియా టార్గెట్‌ను మొదట 99గా, ఆ తర్వాత 102గా నిర్ణయించారు.

వర్షం కారణంగా దాదాపు గంటసేపు పైగా మ్యాచ్ నిలిచిపోయింది. బ్రేక్ సమయానికి 33 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది శ్రీలంక... ఆ తర్వాత దూకుడుగా ఆడిన లంక లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జట్టుకి మంచి స్కోరు అందించారు. మొదటి 33 ఓవర్లలో 74 పరుగులే చేసిన లంక, చివరి 5 ఓవర్లలో 32 పరుగులు చేయడం విశేషం.

మొదటి ఓవర్ నుంచి నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించింది శ్రీలంక. నాలుగో ఓవర్‌లో చమీందు విక్రమసింగే 2 పరుగులు చేసి అవుట్ కాగా, ఆ తర్వాత 10 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 15 పరుగులు మాత్రమే చేయగలిగింది లంక జట్టు...

28 బంతుల్లో 6 పరుగులు చేసిన శివాన్ డానియల్‌ను రాజ్ భవ అవుట్ చేయగా, 33 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన అంజల బండారాని కుశాల్ తంబే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు...

17 బంతుల్లో 4 పరుగులు చేసిన పవన్ పతిరాజాను కుశాల్ తంబే క్లీన్ బౌల్డ్ చేయగా, 36 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసిన సదీశ రాజపక్ష, విక్కీ వత్సల్ బౌలింగ్‌లో షేక్ రషీద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

కెప్టెన్ దునిత్ వెల్లలాగే 15 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి విక్కీ వత్సల్ బౌలింగ్‌లో రాజ్ భవకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 18 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన రనుడా సోమరత్నే కూడా అవుట్ కావడంతో 57 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయింది శ్రీలంక...

26.3 ఓవర్లు ముగిసే సమయానికి 57 పరుగులకి 7 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. ఆ తర్వాత 39 బంతుల్లో 17 పరుగులు జోడించి లంకను ఆదుకునే ప్రయత్నం చేశారు రవీన్ డీ సిల్వ, యషిరు రొడ్రిగో... 8వ వికెట్‌కి 25 పరుగులు జోడించిన తర్వాత రవీన్ డీ సిల్వ అవుట్ అయ్యాడు.

Read Also: ఐసీసీ అవార్డులు 2021: టీమిండియా నుంచి రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే, వుమెన్స్ టీమ్ నుంచి స్మృతి మంధాన...

29 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసి రవీన్ డీ సిల్వను షేక్ రషీద్ రనౌట్ చేయగా వర్షం బ్రేక్ తర్వాత ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత దూకుడుగా ఆడిన యషిరు రొడ్రిగో 26 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేయగా, మతీశ పతిరణ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు.

భారత బౌలర్లలో విక్కీ వత్సల్ 8 ఓవర్లలో 3 మెయిడిన్లలో 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, కుశాల్ తంబే 6 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రవి కుమార్, రాజ్ భవ తలా ఓ వికెట్ తీశారు.