టీమిండియాకి ఎదురుదెబ్బ... గాయంతో ఉమేశ్ యాదవ్ అవుట్... శార్దూల్ ఎంట్రీ ఖాయమే...
రెండో టెస్టులో గాయపడిన సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్...
గాయం తీవ్రత దృష్ట్యా చివరి రెండు టెస్టులకు ఉమేశ్ యాదవ్ దూరం...
షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్...
ఉమేశ్ యాదవ్ స్థానంలో నటరాజన్ వచ్చే ఛాన్స్?
బాక్సింగ్ డే విజయంతో ఉత్సాహంగా ఉన్న టీమిండియాకి ఎదురుదెబ్బ తగిలింది. రెండో టెస్టులో గాయపడిన సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్... మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. మొదట ఉమేశ్ యాదవ్ మూడో టెస్టు ఆడకపోయినా, చివరి టెస్టు సమయానికి కోలుకుంటాడని భావించారంతా.
అయితే ఉమేశ్కి తగిలిన గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతనికి విశ్రాంతి కలిగించాలని ఫిక్స్ అయ్యింది టీమిండియా... మొదటి మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, రెండో మ్యాచ్లో ఓ వికెట్ తీశాడు. బాక్సింగ్ డే టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో వికెట్లేమీ తీయలేకపోయినా, రెండో ఇన్నింగ్స్లో టీమిండియాకి దక్కిన మొదటి వికెట్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్లోనే.
తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తూ సీనియర్ పేసర్ షమీ సిరీస్ మొత్తానికి దూరం కాగా, రెండో టెస్టులో బౌలింగ్ చేస్తూ ఉమేశ్ యాదవ్ జట్టుకి దూరమయ్యాడు. షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్, సిడ్నీ టెస్టులో బరిలో దిగే అవకాశం ఉంది.
ఉమేశ్ యాదవ్ స్థానంలో నటరాజన్ రిజర్వు జట్టులో స్థానం దక్కించుకోవచ్చు. అయితే అతనికి తుది జట్టులో అవకాశం వస్తుందా? అనేది అనుమానమే.