అంతా ఉజ్జయిని మహిమ.. మొన్న విరాట్ కోహ్లీ, నిన్న కెఎల్ రాహుల్.. శివుడి ఆశీస్సులతో అదరగొడుతున్న భారత బ్యాటర్లు
KL Rahul: ఇండియా - ఆస్ట్రేలియా మధ్య ముంబై వేదికగా ముగిసిన తొలి వన్డేలో కెఎల్ రాహుల్ పోరాటపటిమతో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో రాహుల్ ప్రదర్శనకు ‘ఉజ్జయిని’ ప్రభావమే కారణమంటున్నారు నెటిజనులు..
వాంఖడే వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఆసీస్ పేసర్లు రెచ్చిపోవడంతో ఒక దశలో 39 కే నాలుగు కీలక వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన కెఎల్ రాహుల్.. భారత్ కు అద్భుత విజయాన్ని అందించాడు. హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలతో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించి మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ ను 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచేలా చేశాడు.
అయితే ఈ మ్యాచ్ లో రాహుల్.. 91 బంతులాడి 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ ప్రదర్శనకు కారణం ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనమే అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇందుకు సంబంధించిన ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్, ఢిల్లీ టెస్టులలో విఫలమైన తర్వాత రాహుల్.. ఇండోర్ టెస్టుకు ముందు తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు. ఈ టెస్టు ప్రారంభానికి ముందు అతడు ఇండోర్ కు సమీపంలో ఉన్న ఉజ్జయిని ఆలయాన్ని భార్య అతియా శెట్టితో కలిసి దర్శించుకున్నాడు. మూడో టెస్టు మరో రెండ్రోజుల్లో ప్రారంభమవుతుందనగా.. తెల్లవారుజామున 4 గంటలకే ఉజ్జయినికి వెళ్లాడు. అక్కడ మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశాడు. చాలాసేపు అక్కడ గడిపాడు. ఇప్పుడు అవే పూజల ఫలితంగానే రాహుల్ రాణించాడని, ఆ పరమ శివుడు రాహుల్ ను కష్టాల నుంచి కరుణించాడని అభిమానులు చెప్పుకుంటున్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, మీమ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రాహుల్ కంటే ముందు విరాట్ కోహ్లీ పైనా నెటిజన్లు ఇలానే ‘ఉజ్జయిని ప్రభావం’అని ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇండోర్ టెస్టు ముగిశాక కోహ్లీ-అనుష్క దంపతులు ఉజ్జయినికి వెళ్లారు. సంప్రదాయ దుస్తుల్లో అక్కడికి వెళ్లిన కోహ్లీ.. చాలాసేపు మందిరంలో గడిపాడు.
ఇక అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ.. 186 పరుగులతో రాణించిన విషయం తెలిసిందే. 2019 తర్వాత టెస్టులలో సెంచరీ చేయని కోహ్లీ.. ఉజ్జయిని వెళ్లొచ్చాకే మూడంకెల స్కోరు చేరుకున్నాడని నెటిజనులు కామెంట్స్ చేశారు. తాజాగా రాహుల్ కు కూడా ఉజ్జయిని ఆశీస్సులే కాపాడాయని చెప్పుకుంటున్నారు.