ఓపక్క మ్యాచ్ గంగలో కలిసేలా ఉంది.. మీకు ఎలా తినబుద్ది అవుతోంది..? కోహ్లీపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్
WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ చేసిన భారీ స్కోరుకు బదులుగా 150 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
పదేండ్లుగా ఐసీసీ ట్రోఫీ లేదనే బాధ.. ఈసారైనా తెస్తారనే ఆశ మధ్య టీమిండియా ఫ్యాన్స్ ఊగిసలాడుతున్నారు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచినా బ్యాటింగ్ ఆసీస్ కు అప్పగించి, అశ్విన్ ను తుది జట్టులోంచి తప్పించి అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్న టీమిండియాకు మ్యాచ్ ఫలితంపై ఇసుమంతైనా ఆవేదన లేనట్టుంది. ఐపీఎల్ లో వందలాది మ్యాచ్ల వలే ‘ఆ తొక్కలే గెలిస్తే గెలుస్తాం.. ఓడితే ఓడుతాం’ అన్న భావనలో ఉన్నట్టున్నారు ఆటగాళ్లు. తొలి రోజుతో పాటు నిన్న కూడా అదే నిర్లక్ష్యం. అదే లెక్కలేనితనం..
ఓ పక్క మ్యాచ్ ఏమవుద్దోనని టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతుంటే ‘సేవియర్, ఛేజ్ మాస్టర్’ అంటూ ఊదరగొట్టిన విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. 31 బంతుల్లో 14 పరుగులు చేసిన కోహ్లీ.. స్టార్క్ బౌలింగ్ లో స్లిప్స్ లో స్టీవ్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఔట్ అయిన వెంటనే కోహ్లీ పెవిలియన్ కు వెళ్లి.. ‘ఇంత క్రిటికల్ సిట్యూయేషన్ లో ఔటయ్యా’ అన్న చింత ఏమాత్రం లేకుండా తాఫీగా ప్లేట్ లో ఏదో పెట్టుకుని హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేశాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ లతో జోకులు చేసుకుంటూ పుష్టిగా తింటూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ పట్టరాని ఆగ్రహావేశంతో కామెంట్స్ పెడుతున్నారు.
‘మ్యాచ్ ఏమైపోతే మీకేంటి..? మీకు తిండే ముఖ్యం..’, ‘తినండి, పడుకోండి.. షాపింగులు చేసుకుని ఇండియాకు వచ్చి ఐపీఎల్ లో ఆహా ఓహో అనేలా రికార్డులు చేసుకోవడం తప్ప మీరు చేసిందేముంది..? మా బాధలు మీకేం తెలుస్తాయి..?’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరికొందరు.. ‘అసలు మేం ఇంత టెన్షన్ లో ఉంటే మీకు ఎలా తినబుద్ది అవుతుందన్న..’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది.. ‘కోహ్లీ అన్న కూడా మనలాగేరా.. జీవితం ఎలా ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా పట్టించుకునేదే లేదు. బిందాస్ గా తినడం తిరగడం లైఫ్ ఎంజాయ్ చేయడం. మిగతా విషయాలన్నీ మరిచిపోవడం..’అని స్పందిస్తున్నారు.
కాగా డబ్ల్యూటీసీ ఫైనల్స్ రెండో ఆట ముగిసే సమయానికి టీమిండియా.. 38 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రోహిత్ (15), గిల్ (13), పుజారా (14), కోహ్లీ (14) లు విఫలమయ్యారు. రవీంద్ర జడేజా (48) ఆదుకున్నా అతడు కూడా నిష్క్రమించాడు. ప్రస్తుతం రహానే (29 నాటౌట్), భరత్ (5 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులకు ఆలౌట్ అయింది.