ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఇండిపెండెన్స్ డే కానుక ప్రకటించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్
Asia Cup 2022: నాలుగేండ్ల తర్వాత వస్తున్న ఆసియా కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా మొదలుకానున్న ఆసియా కప్ -2022 కోసం ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ లో టీ20 ప్రపంచకప్ కంటే ముందే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కనీసం మూడు సార్లు వస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. ఈ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. టికెట్లను ఎప్పుడెప్పుడు విక్రయిస్తారా..? అని అభిమానులు వేచి చూస్తుండగా భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ కు ఏసీసీ స్వాతంత్ర్య దినోత్సవ కానుక ఇచ్చింది.
ఆగస్టు 28న జరుగబోయే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తో పాటు ఇతర దేశాల మధ్య జరిగే మ్యాచ్ లకు టికెట్లను ఆగస్టు 15 నుంచి అమ్మకానికి పెడుతున్నట్టు ఏసీసీ తాజాగా ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అభిమానులకు సంబంధిత లింక్ లను పేర్కొంటూ ట్వీట్ చేసింది.
టికెట్ల కోసం ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే అభిమానులు.. platinumlist.net అనే వెబ్సైట్ కు వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఇండియా-పాక్ మ్యాచ్ తో పాటు ఇతర మ్యాచ్ లకూ టికెట్లను ఇంకా విక్రయించడం లేదని రెండ్రోజుల క్రితం దుబాయ్ లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ఆన్లైన్ లో బుక్ చేసుకునే అభిమానులు కూడా ఏసీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిర్వాహకులు తాజాగా ఈ ట్వీట్ చేశారు.
ఇక ఆసియా కప్ విషయానికొస్తే.. టోర్నీ ప్రారంభ మ్యాచ్ ఆగస్టు 27న శ్రీలంక-అఫ్ఘనిస్తాన్ మధ్య జరుగనుంది. 28న ఇండియా-పాకిస్తాన్, 30న బంగ్లాదేశ్-అఫ్ఘనిస్తాన్ లు తలపడుతాయి. ఇక ఆగస్టు 31న ఇండియా వర్సెస్ క్వాలిఫైయర్, సెప్టెంబర్ 1న శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్, సెప్టెంబర్ 2న పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతాయి. ఆ తర్వాత సూపర్-4 మ్యాచులు సెప్టెంబర్ 9 వరకు నిర్వహిస్తారు. అదే నెల 11న దుబాయ్ లో ఫైనల్ జరుగుతుంది. మూడు మ్యాచులు షార్జాలో జరగాల్సి ఉండగా మిగిలిన మ్యాచులన్నీ దుబాయ్ వేదికగానే జరుగుతాయి.
రెండు గ్రూపులు, ఆరు జట్లు :
- ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ లు ఇప్పటికే అర్హత సాధించాయి. ఆరో స్థానం కోసం యూఏఈ, హాంకాంగ్, సింగపూర్, కువైట్ లు ఆరో జట్టు కోసం పోటీ పడుతున్నాయి. టోర్నీకి ముందే క్వాలిఫైయర్ మ్యాచులను నిర్వహిస్తారు.
- గ్రూప్- ఏ లో ఇండియా, పాకిస్తాన్, క్వాలిఫైయర్ జట్టు (?) ఉంది.
- గ్రూప్- బీలో శ్రీలంక, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి.
- మ్యాచులన్నీ భారత కాలమానం ఆరుగంటలకు ప్రారంభం కానున్నాయి.