The Ashes: నీదే..! కాదు నీదే..!! ఈజీ క్యాచ్ డ్రాప్ చేసిన ఆసీస్ వికెట్ కీపర్, వార్నర్ భాయ్.. వీడియో వైరల్
Australia Vs England: యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు మరో విజయానికి నాలుగు అడుగుల దూరంలో నిలిచింది. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుండగా వికెట్ కీపర్, స్లిప్స్ లో వార్నర్ లు ఓ సింపుల్ క్యాచ్ డ్రాప్ చేశారు.
అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ విజయం ముంగిట నిలిచింది. తొలి టెస్టు మాదిరే ఇంగ్లాండ్ ను రెండో టెస్టులో కూడా దెబ్బతీస్తున్నది కంగారూ సేన. అయితే ఈ మ్యాచులో విజయాపజయాల సంగతి పక్కనబెడితే ఆన్ ది ఫీల్డ్ లో జరుగుతున్న ఘటనలు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకే కాదు.. టీవీల ముందు చూస్తున్న లక్షలాది క్రికెట్ అభిమానులకు ఫన్ ను పంచుతున్నాయి. రెండో టెస్టులో భాగంగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్.. రెండు ఈజీ క్యాచులను మిస్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆస్ట్రేలియా వంతు వచ్చింది.
ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ, ఫస్ట్ స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ లు ఓ ఈజీ క్యాచ్ ను వదిలేశారు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 47.4 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్ల క్యాచులను వదిలేసి తీవ్ర విమర్శల పాలైన జోస్ బట్లర్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ క్యాచ్ డ్రాప్ కావడం యాధృచ్ఛికం.
47వ ఓవర్లో స్టార్క్ బౌలింగ్ లో బంతి బట్లర్ బ్యాట్ కు తగిలి వెనక్కి వెళ్లింది. వికెట్ కీపర్ కేరీ, ఫస్ట్ స్లిప్ లో ఉన్న డేవిడ్ వార్నర్ ఇద్దరికీ ఆ క్యాచ్ పట్టే అవకాశం ఉంది. కానీ వార్నర్ పడతాడేమోనని కేరీ.. కేరీ క్యాచ్ తీసుకుంటాడేమోనని వార్నర్.. ఇద్దరూ నేలపాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
నాలుగు అడుగుల దూరంలో..
ఇక యాషెస్ సిరీస్ లో ఆసీస్ రెండో విజయం దిశగా సాగుతోంది. ఈ టెస్టులో గెలవడానికి ఆ జట్టుకు మరో నాలుగు వికెట్లు మాత్రమే కావాలి. డిన్నర్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్.. 74 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. వికెట్ కీపర్ జోస్ బట్లర్ (16 నాటౌట్), క్రిస్ వోక్స్ (28 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆదుకుంటాడనుకున్న బెన్ స్టోక్స్ (34) మరోసారి నిరాశపరిచాడు. ఆసీస్ స్టార్ పేసర మిచెల్ స్టార్క్.. 4 వికెట్లు పడగొట్టగా స్పిన్నర్ నాథన్ లియాన్ 3 వికెట్లు తీశాడు.
మిగతా మూడు టెస్టులకు అదే జట్టు :
యాషెస్ సిరీస్ లో మిగిలిన మూడు టెస్టులకు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టులో తొలి రెండు టెస్టులకు ఆడిన క్రికెటర్లే ఆడుతున్నారు. పాట్ కమిన్స్ నేతృత్వంలోని కంగారూలు.. యాషెస్ లో ఇప్పటికే ఆధిక్యంలో ఉన్నారు. రెండో టెస్టులో గాయం కారణంగా దూరమైన జోష్ హెజిల్వుడ్ ఈ టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడని సమాచారం.