ఐసీసీ చరిత్రలోనే తొలిసారిగా మ్యాచ్ రిఫరీ ప్యానెల్లో ఒక మహిళకు అవకాశం దక్కింది.. అది కూడా ఒక తెలుగు మహిళకు ఆ ఛాన్స్ వచ్చింది. రాజమండ్రికి చెందిన గండికోట సర్వ లక్ష్మీ ఈ ఘనత సాధించారు.
క్రికెట్లో రిఫరీకి చాలా ప్రాధాన్యత ఉంది.. మ్యాచ్ నిర్వహణ, ఇతర వ్యవహారాలు అన్ని తానై నడిపించాల్సిన బాధ్యత రిఫరీకి ఉంది. అయితే జెంటిల్మన్ క్రీడగా పేరుగాంచిన క్రికెట్లో నేటి వరకు పురుషులకు మాత్రమే రిఫరీగా అవకాశం దక్కేది.
అయితే ఐసీసీ చరిత్రలోనే తొలిసారిగా మ్యాచ్ రిఫరీ ప్యానెల్లో ఒక మహిళకు అవకాశం దక్కింది.. అది కూడా ఒక తెలుగు మహిళకు ఆ ఛాన్స్ వచ్చింది. రాజమండ్రికి చెందిన గండికోట సర్వ లక్ష్మీ ఈ ఘనత సాధించారు.
తండ్రి ఉద్యోగరీత్యా ఆమె జంషెడ్పూర్లో విద్యాభ్యాసం చేశారు. బీహార్, ఆంధ్ర, ఈస్ట్జోన్, సౌత్జోన్, రైల్వేస్ జట్ల తరపున ఆమె ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో కార్యాలయంలో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు.
51 ఏళ్ల లక్ష్మీ ఇప్పటి వరకు కేవలం మహిళల క్రికెట్ మ్యాచ్లకు రిఫరీగా పనిచేశారు. ఇందులో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లున్నాయి. గత వారం బీసీసీఐ ప్రయోగాత్మకంగా నిర్వహించిన మహిళల టీ20 ఛాలెంజ్ కప్లో లక్ష్మీ మ్యాచ్ రిఫరీగా పనిచేశారు.
తాజాగా ఇకపై ఆమె ఏ అంతర్జాతీయ మ్యాచ్కైనా రిఫరీగా వ్యవహరించవచ్చని ఐసీసీ ప్రకటించింది. క్రికెట్లో మహిళలను ప్రొత్సహించాలనే ఐసీసీ ప్రణాళికల్లో ఇదో ముందడుగని.. అయితే లక్ష్మీ ఎంపిక పూర్తి ప్రతిభపైనే ఆధారపడి జరిగిందని.. ఇక ముందు కూడా ఆమె పనితీరును బట్టే ముందుకు వెళుతుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా తనకు దక్కిన ఈ అవకాశంపై లక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ఐసీసీ రిఫరీ ప్యానెల్లో ఎంపిక కావడంన పట్ల చాలా గర్వంగా ఉందని.. ఇన్నేళ్ల అనుభవంతో మంచి ఫలితాలను సాధిస్తాననే నమ్మకముందని ఆమె స్పష్టం చేశారు
