కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిసిన శ్రీనివాస్ గౌడ్.. రాష్ట్ర క్రీడా పాలసీపై ఆరా తీసిన అనురాగ్ ఠాకూర్
National Games 2022: తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్.. రాష్ట్ర క్రీడా పాలసీపై కేంద్ర మంత్రికి వివరించారు.
తెలంగాణ క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్.. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో భేటి అయ్యారు. గుజరాత్ లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడల సందర్భంగా అక్కడికి వెళ్లిన శ్రీనివాస్ గౌడ్.. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుతో కలిసి అనురాగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్.. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు.
వీరి భేటీ సందర్భంగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రగతిపై శ్రీనివాస్ కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం, ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ అందిస్తున్న వివరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్న అంశంపై కేంద్రమంత్రి ఆశ్చర్యపోయారు. కామన్ వెల్త్ క్రీడల్లో దేశంలో రెండో స్థానంలో నిలిచినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రికి వివరించారు.
ఇదిలాఉండగా గురువారం సాయంత్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 36వ జాతీయ క్రీడలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. స్టార్ స్విమ్మర్ మనా పటేల్ నుంచి టార్చ్ అందుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ లో శ్రీనివాస్ గౌడ్ తో పాటు సాట్స్ చైర్మెన్ వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి, ఇతర క్రీడాకారులు కూడా పాల్గొన్నారు.