పంత్... నిర్భయం, నిర్లక్ష్యానికి తేడా తెలుసుకో: బ్యాటింగ్ కోచ్ స్ట్రాంగ్ వార్నింగ్
టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ వెస్టిండిస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడికి బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
ఐసిసి వన్డే ప్రపంచ కప్ తర్వాత టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో అతడి వారసుడు ఎవరన్న ప్రశ్న అభిమానుల్లో మొదలయ్యింది. అయితే అతడి స్థానాన్ని భర్తీచేయగల సత్తా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కే వుందన్న అభిప్రాయాన్ని మాజీలు, క్రికెట్ పండితులతో పాటు అభిమానులు కూడా వ్యక్తం చేశారు. సెలెక్టర్లు కూడా ఇదే అభిప్రాయానికి రావడంతో ఇటీవల ముగిసిన వెస్టిండిస్ పర్యటన మొత్తానికి ధోని స్థానంలో పంత్ ఎంపికయ్యాడు.
అయితే ఈ పర్యటనలో పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. టీ20, వన్డే, టెస్ట్ సీరిస్ మూడు పార్మాట్లలోనూ అటు వికెట్ కీపర్ గానూ, ఇటు బ్యాట్స్ మెన్ గానూ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో గతంతో పొగిడిన అభిమానులే తాజాగా అతన్ని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పంత్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
''యువ క్రికెటర్లు ఓ విషయాన్ని దృష్టిలో వుంచుకుని బ్యాటింగ్ కు దిగాలి. నిర్భయంగా ఆడాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ ప్రయత్నంలో నిర్లక్ష్యంగా ఆడితేనే సమస్య వచ్చేది. రిషబ్ పంత్ ఆట అలాగే వుంటోంది.
పంత్ బ్యాటింగ్ కు దిగిన వెంటనే దూకుడుగా ఆడాలని అనుకుంటాడు. కానీ అందుకోసం అతడు ఎంచుకునే షాట్లే చెత్తగా వుంటున్నాయి. అలా షాట్ల సెలెక్షన్ లో పొరపాట్లు లేకుండా చూసుకుని దూకుడుగా ఆడితే బావుంటుంది.'' అంటూ పంత్ కు విక్రమ్ రాథోడ్ చురకలు అంటించాడు.