క్లీన్ స్వీప్ చేశారని రూమ్లోకి దూరి, బ్యాగు చోరీ... లండన్ హోటల్లో టీమిండియా ప్లేయర్కి చేదు అనుభవం...
పర్సనల్ రూమ్లోకి దూరి పర్సు కొట్టేశారని ఆరోపించిన భారత వికెట్ కీపర్ తానియా భాటియా...
ఇంగ్లాండ్ టూర్లో వన్డే సిరీస్ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళా జట్టుకి చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లాండ్ పర్యటనను పూర్తి చేసుకున్న భారత జట్టు, నేడు స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. అయితే భారత వికెట్ కీపర్ తానియా భాటియా, తన పర్సును ఎవరో కొట్టేశారంటూ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది...
‘లండన్ మైదా వాలే మారియట్ హోటల్ మేనేజ్మెంట్ నన్ను షాక్కి గురి చేసింది. భారత మహిళా క్రికెట్ టీమ్తో ఉన్న సమయంలో నా పర్సనల్ రూమ్లోకి ఎవరో వచ్చి నా బ్యాగు దొంగిలించారు. ఇందులో డబ్బు, కార్డుల, వాచీలు, జ్యూవెలరీ కూడా ఉన్నాయి. ఇది ఏ మాత్రం సురక్షితం కాదు...
దీనిపై వెంటనే విచారణ చేసి నా బ్యాగును తిరిగి నాకు అందిస్తారని ఆశిస్తున్నా. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, తమ దేశంలో పర్యటించే క్రికెటర్లకు ఇలా భద్రత లేని హోటళ్లలో బస కల్పిస్తారని అనుకోలేదు. నా బ్యాగును త్వరగా తెచ్చి ఇవ్వండి...’ అంటూ వరుస ట్వీట్లు చేసింది భారత మహిళా క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ తానియా సప్నా భాటియా...
వన్డే సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు క్లీన్ స్వీప్ అయిన తర్వాత ఈ సంఘటన జరగడంతో ఎవరో కావాలనే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. టీమిండియా గెలవడాన్ని తట్టుకోలేక ఇంగ్లాండ్ అభిమానులు చేతికి పని చెప్పి ఉంటారని ఆరోపిస్తున్నారు...
మరికొందరు లండన్లో పోయిన వస్తువులు తిరిగి మ్యూజియంలోనే దొరుకుతాయని, అప్పుడు కోహినూర్ డైమండ్ని కొట్టేసి మ్యూజియంలో దాచి పెట్టినట్టే... తానియా పర్సు కూడా ఎప్పుడో ఒక్కప్పుడు అక్కడికి చేరుతుందని భారత మహిళా క్రికెటర్ ట్వీట్ కింద ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో తానియా భాటియాకి బదులుగా యష్తికా భాటియాని ఆడించింది టీమిండియా. వచ్చే నెలలో ఆరంభం కానున్న ఆసియా కప్ 2022 మహిళల టోర్నీకి ప్రకటించిన జట్టులోనూ వికెట్ కీపర్ తానియా భాటియాకి చోటు దక్కింది.