నన్నే కాదు...సెహ్వాగ్, జహీర్ లను అవమానించే జట్టులోంచి తొలగించారు: యువరాజ్
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ టీమిండియా మేనేజ్మెంట్ పై విరుచుకుపడ్డాడు. వారివల్లే తాను కాస్త ముందుగానే రిటైరవ్వాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అతడు తన రిటైర్మెంట్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మరికొంతకాలం అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగాల్సిందని...కానీ టీమిండియా మేనేజ్మెంట్ బలవంతంగా జట్టులోంచి తొలగించిందని ఆరోపించారు. అలా సీనియర్ ఆటగాడినని కూడా చూడకుండా అవమానకరంగా వ్యవహరించడం వల్లే కాస్త తొందరగా రిటైరవ్వాల్సి వచ్చిందంటూ యువీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
''క్యాన్సర్ చికిత్స తర్వాత మంచి ఉత్సాహంతో భారత జట్టులో పునరాగమనం చేశాను. అలా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వరుసగా 8 మ్యాచులాడి రెండు సార్లు మ్యాన్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాను. మెళ్లిగా ఫామ్ ను అందిపుచ్చుకుంటూ గతంలో మాదిరిగా దూకుడుగా ఆడేందుకు సిద్దమవుతున్నా.ఈ టైమ్ లోనే నాకు టీమిండియా మేనేజ్మెంట్ షాకిచ్చింది.
శ్రీలంక తో జరగునున్న సీరిస్ కోసం మొదటిసారి నేను యోయో టెస్ట్ లో పాల్గొన్నాను. అయితే కఠినమైన ఆ టెస్ట్ ను 36ఏళ్ల వయసులో వున్న నేను పాస్ కాలేనని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. కానీ పిట్ నెస్ పై ఎక్కువగా దృష్టిపెట్టే తనకు అదేమీ పెద్ద కష్టంగా అనిపించలేదు. దీంతో సునాయాసంగా ఈ యోయో టెస్ట్ ను ఎదుర్కొన్నాను. దీంతో వారి అంచనాలు తలకిందులయ్యాయి.
ఇలా యోయో టెస్ట్ సాకుతో నన్ను జట్టులోంచి తొలగించవచ్చన్న మేనేజ్మెంట్ ఆలోచన బెడిసికొట్టింది. దీంతో కనీసం కారణం కూడా చెప్పకుండానే శ్రీలంక సీరిస్ కు నన్ను దూరం పెట్టారు. ఆ తర్వాత దేశవాళి మ్యాచులపై దృష్టి పెట్టాలంటూ చావుకబురు చల్లగా చెప్పారు. వారు నా పట్ల అలా అవమానకరంగా వ్యవహరించడాన్ని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నా.
ఇలాంటి అనుభవం కేవలం నాకు మాత్రమే మరో ఇద్దరు సీనియర్లు సెహ్వాగ్, జహీర్ ఖాన్ లకు ఎదురయ్యింది. వారిని కూడా ఎలాంటి సమాచారం లేకుండానే జట్టులోంచి తొలగించారు.ఇలా ఎన్నో ఏళ్లు జట్టుకు, దేశానికి సేవ చేసిన మమ్మల్ని అవమానించడం ఎంతవరకు సమంజసం. ఒకవేళ ఎవరైనా సీనియర్ల ఆట మీకు నచ్చకుంటే నిర్మొహమాటంగా ఆ విషయాన్ని వారికి చెప్పండి. కానీ ఇలా అవమానించకండి.'' అని యువరాజ్ టీమిండియా మేనేజ్మెంట్ కు సూచించాడు.