మరీ ఇంత అద్వానమా... టీమిండియా ప్రదర్శనపై గంగూలీ అసంతృప్తి
టీమిండియా గత ఆరేళ్లలో ఒక్క ఐసిసి ట్రోఫీని కూడా గెలవకపోవడంపై మాజీ సారథి సౌరవ్ గంగూలి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మధ్య కాలంలో ఏకంగా మూడు ఐసిసి టోర్నీల్లో ఓటమిపాలవడం మంచి పరిణామం కాదని ఆయన పేర్కొన్నాడు.
టీమిండియా ప్రస్తుతం అద్భుతంగా ఆడుతున్నా ప్రతిష్టాత్మక ఐసిసి టోర్నమెంట్లలో మాత్రం ఆకట్టుకోలేకపోతోందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. గత ఆరేళ్లలో మూడు ఐసిసి టోర్నీలు జరగ్గా భారత్ ఒక్కటి కూడా గెలవలేకపోయిందని గుర్తుచేశారు. ఇలాంటి ప్రదర్శనతో నెంబర్ స్థానాన్ని చేజిక్కించుకోవడం చాలా కష్టమని అన్నారు. ఐసిసి టోర్నీల్లో గెలవాలంటే ఆటగాళ్లకు దూకుడు ఎంత అవసరమో ఓపిక, సహనం కూడా అంతే అవసరమని పేర్కొన్నాడు. ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత ఆటగాళ్లలో అవి కనిపించలేవని గంగూలీ పేర్కొన్నాడు.
''2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా ఇప్పటివరకు ఒక్క ఐసిపి టోర్నమెంట్ లో కూడా విజేతలుగా నిలవలేకపోయింది. 2016లో జరిగిన టీ20 ప్రపంచ కప్ తో ప్రారంభమైన ఈ ఓటముల పరంపర మొన్న ముగిసిన వన్డే ప్రపంచ కప్ వరకు సాగింది. ఈ మధ్యలో 2017 ఛాపింయన్స్ ట్రోఫీలో చివరివరకు చాలాబాగా ఆడిన భారత్ చివరకు ఫైనల్లో పాక్ చేతిలో ఓటమిపాలయ్యింది. ఇలా వరుసగా మూడు ఐసిసి టోర్నీల్లోనూ భారత జట్టు సత్తా చాటలేకపోయింది.
కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ అనేది గల్లీలో పిల్లల ఆడుకునే ఆట కాదని గుర్తించాలి. ఓ ప్రణాళికాబద్దంగా ఆడకుంటే ఎంతటి గొప్ప ఆటగాళ్లను కలిగిన జట్టయినా ఓటమిపాలవుతుంది. కాబట్టి ఐసిసి టోర్నీల్లో ఎదురవుతున్న ఓటముల నుండి భారత జట్టు విజయాల బాట పట్టాలంటే ఇంగ్లాండ్ మాదిరిగానే వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. 2015 ప్రపంచ కప్ నుండి ఘోరంగా నిష్ర్కమించిన అదే ఇంగ్లాండ్ 2019కి వచ్చేసరికి విశ్వవిజేతగా నిలిచింది. అలా పరాజయాలను నుండి గుణపాఠాలు నేర్చుకుంటేనే మరోసారి తప్పులు చేయకుండా వుంటారు.
ఈ ప్రపంచ కప్ లో కోహ్లీ, బుమ్రా, రోహిత్ లు అద్భుతంగా ఆడారు. అయితే కేవలం వీరు మాత్రమే ఆడితే సరిపోదని జట్టు మొత్తం సమిష్టిగా రాణిస్తేనే ఐసిసి టోర్నమెంట్లలో గెలుపు సాధ్యమవుతుంది. ప్రతి ఆటగాడు మ్యాచ్ విన్నర్ గా మారితేనే మంచి ఫలితాలు వస్తాయి.'' అంటూ గంగూలీ టీమిండియాకు పలు సలహాలు,, సూచనలు ఇచ్చాడు.