కోహ్లీ చేతిలో సచిన్ రికార్డులు బద్దలు... చాలా సంతోషంగా వుంది: కపిల్దేవ్
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ రికార్డులను కనీసం ఎవ్వరూ టచ్ కూడా చేయలేరనుకుంటుంటే కోహ్లీ వాటికి బద్దలుగొడుతుంటే చాలా ఆనందంగా వుందన్నాడు.
సచిన్ టెండూల్కర్... ఇండియన్ క్రికెట్ గాడ్. భారత క్రికెట్ ను ఓ స్థాయిని తీసుకెళ్లిన ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారించిన అతడు అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే సచిన్ శకం ముగిసిన తర్వాత అతడి స్థానాన్ని విరాట్ కోహ్లీ భర్తీ చేస్తున్నాడు. సచిన్ వారసుడిగా పేరుతెచ్చుకున్న కోహ్లీ అతడిపేరిట వున్న రికార్డులను ఒక్కోటిగా బద్దలుగొడుతున్నాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో నంబర్ వన్ క్రికెటర్ గా ఎదిగిన కోహ్లీని చూసి టీమిండియా అభిమానులతో పాటు తాను కూడా గర్వపడుతున్న మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసించాడు.
''మా శకానికి...ప్రస్తుత శకానికి సచిన్ టెండూల్కర్ వారధిగా నిలిచాడు. సచిన్ రిటైరయ్యే నాటికి ఎన్నో అసాధారణ రికార్డులు అతడి పేరిట వున్నాయి. వాటిని ఎవ్వరూ అందుకోలేరని భావించేవాడిని. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ కోహ్లీ ఎగిసే కెరటంలా ముందుకు వచ్చాడు.
టీమిండియాకు అసాధారణ విజయాలను అందిస్తూనే కోహ్లీ సచిన్ రికార్డులను బద్దలుగొడుతున్నాడు. తన శకంలో సచిన్ రికార్డుల మోత మోగిస్తే...ఈ శకంలో కోహ్లీ ఆ పని చేస్తున్నాడు. సచిన్ టీమిండియా స్థాయిని పెంచితే కోహ్లీ దాన్న మరోస్థాయికి తీసుకెళుతున్నాడు. కోహ్లీ వంటి మెరుగైన ఆటగాడు దొరకడం భారత జట్టుకు బాగా కలిసొస్తోంది. అతడి ఆటను నేను అమితంగా ఇష్టపడతాను. అతడు ఏదైనా రికార్డును బద్దలుగొట్టినట్లు తెలియగానే చాలా సంతోషంగా వుంటుంది.
ప్రతిక్షణాన్ని క్రికెట్ కోసమే కేటాయించే చాలా అరుదైన క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. అతన్ని భారత జట్టుకు అందించిన డిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ ఆటగాళ్ల సత్తా ఏంటో నిరూపించుకుంది. ప్రతి అసోసియేషన్ కోహ్లీ వంటి అత్యుత్తమ ఆటగాళ్లను తయారుచేసి భారత్ కు అందించాలి. ఈ విషయంలో క్రికెట్ అసోసియేషన్ల మధ్య పోటీ వుండాలి ''అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.