Ind Vs Ban U-19: టీమిండియాకు గుడ్ న్యూస్.. కెప్టెన్ సహా వాళ్లంతా ఫిట్.. బంగ్లాతో మ్యాచ్ కు సిద్ధం.. కానీ..
ICC Under-19 world Cup 2022: శనివారం భారత జట్టు.. బంగ్లాదేశ్ తో క్వార్టర్స్ ఆడనున్న నేపథ్యంలో భారత శిభిరంలో ఈ వార్త ఉత్సాహం నింపేదే.. వారం రోజుల క్రితం కరోనా బారిన పడ్డ ఆరుగురు ఆటగాళ్లలో..
విండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో క్వార్టర్స్ ఫైనల్ కు చేరుకున్న భారత్ కు శుభవార్త. ఐర్లాండ్ తో మ్యాచుకు ముందు కరోనా బారిన పడ్డ కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ తో పాటు మిగిలిన ప్లేయర్లంతా కోలుకున్నారు. శుక్రవారం వాళ్లు ప్రాక్టీస్ లో కూడా పాల్గొన్నట్టు టీమ్ మేనేజ్మెంట్ వర్గాలు తెలిపాయి. శనివారం భారత జట్టు.. బంగ్లాదేశ్ తో క్వార్టర్స్ ఆడనున్న నేపథ్యంలో భారత శిభిరంలో ఈ వార్త ఉత్సాహం నింపేదే. ప్రపంచకప్ లో భాగంగా ఐర్లాండ్ తో మ్యాచుకు ముందు యశ్ ధుల్, షఏక్ రషీద్, సిద్ధార్థ యాదవ్, ఆరాధ్య యాదవ్, మనవ్ పరక్ లకు కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిషాంత్ సింధు యువ భారత్ ను నడిపించాడు. ఇదిలాఉండగా.. ఉగాండా మ్యాచ్ అనంతరం సింధూకూ పాజిటివ్ వచ్చినట్టు సమాచారం.
కాగా గురువారం రాత్రి వైరస్ సోకిన ఆటగాళ్లందరికీ మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా ఈ అందరికీ నెగిటివ్ వచ్చింది. వారం రోజుల పాటు వాళ్లంతా క్వారంటైన్ లో గడిపారు. అయితే నెగిటివ్ వచ్చినా ఈ ఆటగాళ్లు రేపటి బంగ్లాదేశ్ మ్యాచు ఆడతారా..? లేదా..? అనేది అనుమానాస్పదంగానే ఉంది. ప్లేయర్లందరికీ కరోనా నెగిటివ్ వచ్చినా ఈ మేరకు టీమ్ మేనేజ్మెంట్ కూడా వారి రిపోర్డులను నిర్వాహకుల (ఐసీసీ)కు సమర్పించాల్సి ఉంది. వాటిని పరిశీలించిన మీదటే యశ్ ధుల్ తో పాటు ఇతరులను బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడనిస్తారా..? లేదా..? అనేది తేలనుంది.
ఐర్లాండ్ తో మ్యాచుకు ముందు వీళ్లంతా కరోనా బారిన పడ్డారు. దీంతో భారత్ ఈ టోర్నీలో కొనసాగుతుందా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ స్టాండ్ బై ప్లేయర్లతో అయినా యువ భారత్ రాణించింది. ఐర్లాండ్ తో పాటు ఉగాండాతో జరిగిన మ్యాచులో మన కుర్రాళ్లు చెలరేగి ఆడి క్వార్టర్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు.
భారత జట్టులో ధుల్, రషీద్ కీలక బ్యాటర్లు. గత రెండు మ్యాచులలో వాళ్లు లేకున్నా ఓపెనర్ రఘువంశీ, ఆల్ రౌండర్ రాజ్ బవ రాణించారు. మరోవైపు లెప్టార్మ్ స్పిన్నర్ విక్కీ ఒస్త్వాల్ కూడా ఈ టోర్నీలో ఇప్పటికే ఏడు వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు. తాత్కాలిక సారథి నిషాంత్ సింధు కూడా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఇక క్వార్టర్స్ లో భారత్ ప్రత్యర్థి బంగ్లాదేశ్ ను ఓడించేందుకు భారత్ అన్ని అస్త్రాలతో సిద్ధమైంది. గత ప్రపంచకప్ (2020) ఫైనల్లో బంగ్లాదేశ్ జట్టు భారత్ ను ఓడించి కప్ ఎగురేసుకుపోయింది. క్వార్టర్స్ లో ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తున్నది. ఇటీవల యూఏఈలో జరిగిన ఆసియా కప్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసి టైటిల్ను కైవసం చేసుకుంది టీమిండియా. ఆ ప్రదర్శననే పునరావృతం చేయాలని కోరుకుంటున్నది.