భారత్-వెస్టిండిస్ ల మధ్య జరగనున్న టీ20 సీరిస్ కు అమెరికా వేదికకానుంది. ఇలా ఇరు దేశాల మధ్య జరిగే టీ20 సమరం ద్వారా అమెరికన్లు కూడా పొట్టి క్రికెట్ మజాను ఆస్వాదించనున్నారు.

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా అమెరికాకు బయలుదేరింది. అదేంటి వెస్టిండిస్ పర్యటన అంటే టీమిండియా కరీబియన్ దీవులకు పయనమవ్వాలి కానీ అమెరికాకు వెళ్లడమేంటని ఆశ్యర్యపోతున్నారా. అయితే మీరు మరోసారి భారత్-వెస్టిండిస్ మధ్య జరగనున్న టీ20 సీరిస్ షెడ్యూల్ ను జాగ్రత్తగా గమనించాల్సిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వచ్చే నెల(ఆగస్ట్) 3నుండి 6వ తేదీ వరకు భారత్-వెస్టిండిస్ లు మూడు టీ20 మ్యాచుల్లో తలపడనున్నాయి. అయితే ఈ టీ20 సీరిస్ వెస్టిండిస్ లో కాకుండా అమెరికాలో జరగనుంది. వరుసగా 3,4 తేదీల్లో జరగనున్న మ్యాచులకు ప్లోరిడా ఆతిథ్యమివ్వనుంది. ఇక 6వ తేదీన గయానాలో చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందుకోసమే టీమిండియా ఇవాళ నేరుగా అమెరికాకు పయనమయ్యింది. ఈ సీరిస్ అనంతరం భారత జట్టు కరీబియన్ దీవుల్లో అడుగుపెట్టనుంది. 

ఇలా టీమిండియా, వెస్టిండిస్ ల మధ్య జరిగే పోరు అమెరికన్లకు మజానివ్వనుందన్న మాట. అంతేకాకుండా యూఎస్ఎ లో భారీ సంఖ్యలో స్థిరపడ్డ భారతీయులతో పాటు వెస్టిండిస్ దేశస్థులకు ఈ సీరిస్ ద్వారా తమ జట్ల ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం వచ్చింది. ఇప్పటికే ఈ మ్యాచ్ ల కోసం భారతీయులు భారీగా టికెట్లు కొనుగోలుచేసినట్లు సమాచారం. అలాగే అమెరికన్లు కూడా ఈ సీరిస్ పై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 

ఈ టీ20 సీరిస్ ముగిసిన తర్వాత కూడా 8వ తేదీన వన్డే సీరిస్ గయానాలోనే ప్రారంభంకానుంది. ఆ తర్వాత 11, 14 తేదీల్లో జరిగే 2,3 వన్డేలకు ట్రినిడాన్ వేదిక కానుంది. ఇక రెండు టెస్ట్ మ్యాచుల్లో మొదటి మ్యాచ్ అంటిగ్వా, రెండో మ్యాచ్ జమైకాలో జరగనుంది. ఇలా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య సీరిస్ వివిధ దేశాల్లో సాగనుంది.