ఆంధ్రా నుంచి హైదరాబాద్కి హనుమ విహారి... ఐదేళ్ల తర్వాత జట్టు మారుతున్నట్టు...
2015 సీజన్లో చివరిసారిగా హైదరాబాద్ జట్టుకి ఆడిన హనుమ విహారి... ఈ సీజన్లో హైదరాబాద్ మారుతున్నట్టు ప్రకటన...
భారత టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ హనుమ విహారి, ఐదేళ్ల తర్వాత హైదరాబాద్ తరుపున ఆడబోతున్నాడు. 2015 సీజన్లో చివరిసారిగా హైదరాబాద్ జట్టుకి ఆడిన హనుమ విహారి, మళ్లీ హైదరాబాద్కి ఆడబోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు హనుమ విహారి...
కాకినాడలో జన్మించిన హనుమ విహారి, హైదరాబాద్లో చదువు పూర్తిచేసుకోవడంతో పాటు ఇక్కడ క్రికెటర్గా ఎదిగి, భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2018లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన హనుమ విహారి, అతి తక్కువ కాలంలో క్లాస్ టెస్టు ప్లేయర్గా చోటు దక్కించుకున్నాడు.
తన కెరీర్లో 12 టెస్టులు ఆడిన హనుమ విహారి, ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో 624 పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ మెరిసి 5 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ టూర్కి ఎంపికైన హనుమ విహారి, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్కి ముందు కౌంటీ ఛాంపియన్షిప్ కోసం ఇంగ్లాండ్కి వెళ్లాడు.
అయితే ఇంగ్లాండ్ టూర్లో ఒక్క టెస్టు కూడా ఆడలేకపోయాడు హనుమ విహారి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో హనుమ విహారికి మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా 94 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన విహారి, 7261 పరుగులు చేశాడు ఇందులో 21 సెంచరీలు కూడా ఉన్నాయి...