ఫైనల్లో ఔటైతే సచిన్ ముద్ద ముట్ట లేదు .. విరాట్ ఏమో ఇలా : నెటిజన్ల ట్రోలింగ్ , స్పందించిన కోహ్లీ
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శనపై అభిమానులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న ట్రోలింగ్పై కోహ్లీ స్పందించారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శనపై అభిమానులు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 2వ రోజు ఔటైన వెంటనే తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్లో భోజనం చేస్తున్న ఫోటోను కోహ్లీ షేర్ చేసుకోవడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో 2వ రోజు కోహ్లీని ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 14 పరుగుల వద్ద ఔట్ చేశాడు. స్టార్క్ సంధించిన బంతి కోహ్లీ బ్యాట్ను తాకి సెకండ్ స్లిప్లో స్టీవ్ స్మిత్ చేతికి చిక్కింది. టెస్టుల్లో అతని కమ్ బ్యాక్ గురించి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్ అతని పేలవ ప్రదర్శనతో షాక్ అయ్యారు. ఈ వెంటనే ఆయనను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
2003 ప్రపంచకప్లో టెండూల్కర్ త్వరగా ఔట్ కావడంపై తీవ్ర మనస్థాపానికి గురై మూడు రోజుల వరకు భోజనం ముట్టుకోలేదు . కానీ కోహ్లీ మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్లో ఔటైన వెంటనే తింటున్నాడు అంటూ ఓ యూజర్ ఘాటుగా ట్వీట్ చేశాడు. ఇది కోహ్లీ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే 3వ రోజు ఆట ప్రారంభం కావడానికి ముందు కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రోలర్స్కి చెక్ పెట్టేందుకు యత్నించాడు. ఇతరుల అభిప్రాయాలు అనే జైలు నుంచి నువ్వు బయటపడేందుకు .. అయిష్టమనే సామర్ధ్యాన్ని తప్పకుండా అభివృద్ధి చేసుకోవాలని కోహ్లీ పేర్కొన్నాడు.
ఇదిలావుండగా.. 2వ రోజు ఆటలో భాగంగా టీమిండియా 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి విషమ పరిస్థితుల్లో నిలిచింది. వికెట్లు పడుతున్నా రవీంద్ర జడేజా, అజింక్యా రహానేలు క్రీజులో నిలబడి ఇన్నింగ్స్ను నిర్మించే యత్నం చేశారు. ఐదో వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన అనంతరం .. నాథన్ లియాన్ బౌలింగ్లో జడేజా చివరిగా నిష్క్రమించాడు. కేఎస్ భరత్, రహానేలు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. భారత్ .. ఆస్ట్రేలియా కంటే 318 పరుగులు వెనుకబడి వుండగా, చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే వున్నాయి.