టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య సెంచరీల విషయంలో పోటీ నెలకొంది. వీరిద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ మరీ సెంచరీలు బాదుతున్నారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య కోల్డ్ వార్ సాగుతున్నట్లు ఓ ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు నిజముందో తెలీదుగానీ ఓ విషయంలో మాత్రం వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వీరిద్దరూ పరుగుల దాహంతో చెలరేగుతూ పోటాపోటీగా సెంచరీలు సాధిస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక శతకాలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరు మొదటి రెండు స్థానాలను ఆక్రమించారు. ఆరు సెంచరీలో రోహిత్ మొదటి స్థానంలో నిలవగా కోహ్లీ 5 సెంచరీలతో రెండో స్ధానానికి పరిమితమయ్యాడు.
ఇటీవలే ముగిసిన వెస్టిండిస్ వన్డే సీరిస్ లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు బాది టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ రెండు సెంచరీలను కలుపుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు అతడు సాధించిన సెంచరీల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఓ సెంచరీ, ఆ జట్టు ఇండియా పర్యటనలో మరో 2 సెంచరీలు సాధించాడు. ఇలా కోహ్లీ ఖాతాలో మొత్తం ఐదు సెంచరీలు చేరాయి.
ఇక రోహిత్ విషయానికి వస్తే ఐసిసి ప్రపంచ కప్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు ఏకంగా ఐదు సెంచరీలు సాధించాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ఇతడు ఓ సెంచరీ సాధించాడు. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు రోహిత్ ఆరు సెంచరీలు సాధించి రోహిత్ పై పైచేయి సాధించాడు.
ఇకపోతే ఈ ఏడాదిలో మిగిలిన నాలుగు నెలల్లో టీమిండియా నాలుగు వన్డే సీరిస్ లు ఆడనుంది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండిస్ జట్లతో భారత జట్టు వరుసగా తలపడనుంది. వీటిల్లో కోహ్లీ, రోహిత్ లలో ఎవరు అద్భుతంగా ఆడితే వారే ఈ ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లుగా నిలవనున్నారు.
