టీమిండియా గెలుపుకే కాదు...నా సెంచరీలకు కూడా కారణమతడే: కోహ్లీ
వెస్టిండిస్ జట్టును వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి టీమిండియా వన్డే సీరిస్ ను కైవసం చేసుకుంది. టీ20 సీరిస్ మాదిరిగానే వన్డే సీరిస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసి భారత్ సత్తా చాటింది.
కరీబియన్ గడ్డపై టీమిండియా తిరుగులేని ఆధిక్యం కొనసాగుతోంది. వెస్టిండిస్ ను వారి స్వదేశంలోనే చిత్తు చేస్తూ భారత ఆటగాళ్లు అదరగొట్టే ప్రదర్శన చేస్తున్నారు. ఇలా ఇదివరకే టీ20 సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీసేన తాజాగా వన్డే సీరిస్ లోనూ అదే పలితాన్ని రాబట్టింది. మూడు వన్డేల సీరిస్ 2-0 తేడాతో టీమిండియా సొంతమయ్యింది.
అయితే ఈ సీరిస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అనడంలో అతిశయోక్తి లేదు. వర్షం కారణంగా మొదటి వన్డే రద్దవగా మిగిలిన రెండు వన్డేలను భారత్ గెలుచుకుంది. ఈ రెండింటిలోనూ కోహ్లీ వరుస సెంచరీలు, శ్రేయాస్ అయ్యర్ వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత జట్టు వన్డే సీరిస్ ను గెలుచుకోగలిగింది.
అయితే ఈ వన్డే సీరిస్ గెలుపు కోసం తన సెంచరీల కంటే అయ్యర్ హాప్ సెంచరీలే ఎక్కువగా పనిచేశాయని కోహ్లీ ప్రశంసించాడు. అయ్యర్ నుండి అందిన మంచి సహకారంతోనే తాను రెండు వన్డేల్లోనూ సెంచరీలు సాధించగలిగానని తెలిపాడు. తాను తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్ చేస్తున్నపుడు క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఆ ఒత్తిడిని తగ్గించాడు. అతడి సమయోచిత బ్యాటింగ్ వల్లే రెండు మ్యాచుల్లో తమ చేజారిపోయిందనుకున్న గేమ్ తమవైపు మళ్లింది. అందువల్లే ఈ వన్డే సీరిస్ విజయం అతడి వల్లే సాధ్యమైందని అనడంలో తనకెలాంటి అభ్యంతరాలు లేవని కోహ్లీ వెల్లడించాడు.
భారత్-విండీస్ మధ్య జరిగిన మూడు వన్డేలకు వర్షం అంతరాయం కలిగించింది. దీని వల్ల మొదటి వన్డే పూర్తిగా తుడిచిపెట్టుకుని పోగా రెండు, మూడు వన్డేల్లో డక్ వర్త్ లూయిస్ పద్దతిన ఫలితం తేలింది. అయితే కోహ్లీ రెండో వన్డే(120 పరుగులు 125 బంతుల్లో), మూడో వన్డే (114 పరుగులు 99 బంతుల్లో) వరుస సెంచరీలతో, యువకెరటం శ్రేయాస్ అయ్యర్ రెండో వన్డే(71 పరుగులు 68 బంతుల్లో), మూడో వన్డేలో(65 పరుగులు 41 బంతుల్లో)వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత జట్టు వెస్టిండిస్ పై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించగలిగింది.