BCCI Politics: బీసీసీఐలో అతడు కంగనా రనౌత్..! కేంద్ర హోంమంత్రి కొడుకుపై మండిపడుతున్న కోహ్లి ఫ్యాన్స్
BCCI-Virat Kohli Row: బీసీసీఐ రాజకీయాల కారణంగానే సాఫీగా సాగాల్సిన విరాట్ కోహ్లి కెరీర్ నాశనమవుతుందని అతడి అభిమానులు ఆ ఇద్దరిమీద దుమ్మెత్తి పోస్తున్నారు.
గత కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న లావా బద్దలైంది. టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పకుంటున్నట్టు ప్రకటించగానే దిగ్బ్రాంతికి గురైన అతడి అభిమానులు.. బీసీసీఐ, బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ప్రధాన కార్యదర్శి జై షా ల మీద మండిపడుతున్నారు. గంగూలీ, జై షా ల రాజకీయాల కారణంగానే కోహ్లి కెరీర్ నాశనమవుతుందని ఆ ఇద్దరి మీద దుమ్మెత్తి పోస్తున్నారు. సాఫీగా సాగిపోతున్న భారత క్రికెట్ కు ఈ ఇద్దరు అడ్డంకిగా మారారని వాపోతున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి, బీజేపీలో కీలక వ్యక్తిగా ఉన్న అమిత్ షా కుమారుడు జై షా పై కోహ్లి ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిల్లమవుతున్నారు. అతడిని బీసీసీఐ లో కంగనా రనౌత్ తో పోలుస్తున్నారు.
టెస్టు కెప్టెన్ గా కోహ్లి తప్పకుంటున్నట్టు ప్రకటించగానే ట్విట్టర్ లో అతడి అభిమానుల వేళ్లన్నీ గంగూలీ, జై షా ల మీదకే మళ్లాయి. ఆ ఇద్దరినీ టార్గెట్ చేస్తూ.. దారుణమైన ట్రోలింగ్ లకు పాల్పడుతున్నారు కోహ్లి అభిమానులు. ఇక జై షా నైతే కోహ్లి అభిమానులు ఆడుకుంటున్నారు. బాలీవుడ్ లో డ్రగ్స్, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి, ఇతరత్రా అంశాలపై చిచ్చు రాజేసే నటి కంగనా రనౌత్ తో పోలుస్తున్నారు.
బాలీవుడ్ లో నిప్పు రాజేస్తున్న కంగనా..
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం, బాలీవుడ్ డ్రగ్స్ కేసు, ఎన్నార్సీ, సీఏఏ, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ కూటమి.. తదితర అంశాల మీద బాలీవుడ్ లో కంగనా రనౌత్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఆమె పరోక్షంగా బీజేపీకి ఏజెంట్ లా వ్యవహరిస్తుందని వాదించేవారు లేకపోలేదు. దేశంలో పలు అంశాల మీద ఆమె చేస్తున్న ప్రకటనలు, వ్యవహార శైలి కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది.
ఇక జై షా వచ్చిన తర్వాత బీసీసీఐ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది అంటున్నారు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్. బీసీసీఐ లోకి రాకముందు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ లో చక్రం తిప్పాడు జై షా. ఆ తర్వాత అమిత్ షా హోంమంత్రి అయ్యాక జై షా.. బీసీసీఐలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతడు కూడా బీజేపీకి అనుకూలంగానే వ్యవహారాలు చేస్తున్నాడని, అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేవిధంగా అతడు ప్రవర్తిస్తూ పరోక్షంగా ఆ పార్టీకి లబ్ది చేకూరుస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ గేమ్ లో కూడా గంగూలీ కూడా పావులా మారాడని విరాట్ అభిమానులు మండిపడుతున్నారు. గతేడాది ముగిసిన బెంగాల్ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు.. గంగూలీ బీజేపీలో చేరనున్నాడని, అతడే అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఏం జరిగిందో ఏమో గానీ గంగూలీ ఆ దిశగా ముందుకు వెళ్లలేదు.
ఆ ట్వీటే విరాట్ కొంప ముంచిందా..?
రవిశాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లి ఎంత చెబితే అంత. బీసీసీఐ కూడా ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకునేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అయితే విరాట్ కోహ్లి పై బీసీసీఐ ఇంత కఠినంగా వ్యవహరించడానికి కూడా కారణం బీజేపీయే అని అతడు అభిమానులు వాపోతున్నారు. 2020 లో ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో ఓ మైనర్ పై జరిగిన గ్యాంగ్ రేప్ పై విరాట్ కోహ్లి ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఈ ఘటనలో దోషులకు శిక్ష పడాలని, ఆమెకు న్యాయం జరుగాలని ట్వీట్ లో పేర్కొన్నాడు. దీనిపై కూడా బీజేపీ గుర్రుగా ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
హత్రాస్ ఘటన దేశాన్ని ఒక ఊపు ఊపింది. యోగి పాలనలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఘటనతో తీవ్రంగా నష్టపోయింది. ఆ సమయంలో దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్కషంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే కోహ్లిని అప్పుడు ఏమీ చేయలేకపోయిన బీజేపీ.. ఇప్పుడు జై షా ద్వారా ప్రతీకారం తీర్చుకుంటుందని కోహ్లి అభిమానులు ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.