Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup 2021: హమ్మయ్య గెలిచారు... టీమిండియాకి తొలి విజయం, ఆఫ్ఘాన్‌పై భారీ తేడాతో...

T20 worldcup 2021: ఆఫ్ఘాన్‌పై 66 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా... కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర...

T20 Worldcup 2021:  Team India beats Afghanistan and registers first victory in t20 worldcup
Author
India, First Published Nov 3, 2021, 11:15 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఎట్టకేలకు టీమిండియా తొలి విజయాన్ని రుచి చూసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో, న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా, పసికూన ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది...

ఈ విజయంతో టీ20ల్లో కెప్టెన్‌గా 30వ విజయాన్ని అందుకున్నాడు విరాట్ కోహ్లీ... మూడు ఫార్మాట్లలోనూ 30కి పైగా విజయాలు అందుకున్న ఏకైక కెప్టెన్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు కోహ్లీ... -1.609 నెట్‌ రన్‌రేట్‌తో ఈ మ్యాచ్‌ను ప్రారంభించిన టీమిండియా, ఈ విజయంతో పాజిటివ్‌ రన్‌రేట్ +0.073 సాధించింది.

211 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బ్యాటింగ్ ఆరంభించిన ఆఫ్ఘాన్‌కి మూడో ఓవర్‌లో తొలి షాక్ తగిలింది. 4 బంతులాడిన మహ్మద్ షాజాద్, షమీ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి హజ్రతుల్లా జజాయ్ 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

ఆ తర్వాత రహ్మతుల్లా గుర్బాజ్ 10 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో అవుట్ కాగా, 20 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన గుల్బాదిన్ నయిబ్‌ని అశ్విన్ అవుట్ చేశాడు...
13 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన జాద్రాన్‌ను అశ్విన్ బౌల్డ్ చేయగా మహ్మద్ నబీ 32 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

జనత్ 22 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 66 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది టీమిండియా.  షమీ మూడు వికెట్లు తీయగా నాలుగున్నరేళ్ల తర్వాత టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన రవి అశ్విన్ 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో లేట్ అయినా లేటెస్ట్‌గా ఫామ్‌లోకి వచ్చారు భారత బ్యాట్స్‌మెన్. పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచుల్లో విఫలమైన భారత బ్యాట్స్‌మెన్.,. పసికూన ఆఫ్ఘాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విశ్వరూపం చూపించారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరు చేసింది...

కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 140 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదుచేశారు. ముందు రెండు మ్యాచుల్లో చేసిన తప్పులు చేయకుండా సింగిల్స్ తీస్తూ, అవకాశం దొరికినప్పుడు బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసిన రోహిత్ శర్మ, కరీం జనత్ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, గుల్బాదిన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ఈ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇదే అతి పెద్ద స్కోరు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో టీమిండియాకి ఇది రెండో అత్యుత్తమ స్కోరు. ఇంతకుముందు 2007లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది భారత జట్టు. ఆ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే.

మొదటి వికెట్‌కి రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ కలిసి నిర్మించిన 140 పరుగుల భాగస్వామ్యం, విదేశాల్లో రెండో అత్యుత్తమ పార్టనర్‌షిప్. ఇంతకుముందు టీ20ల్లో రోహిత్, ధావన్ కలిసి 160 పరుగులు జోడించారు...
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత జట్టుకి 100+ ఓపెనింగ్ భాగస్వామ్యం రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2007లో ఇంగ్లాండ్‌పై గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత ఆ రికార్డు క్రియేట్ చేశారు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ. 

రోహిత్ శర్మకు టీ20 వరల్డ్‌కప్ కెరీర్‌లో ఏడో హాఫ్ సెంచరీ. 2014 టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి ప్రపంచకప్‌లో మొదటిసారి హాఫ్ సెంచరీ మార్కు దాటాడు రోహిత్ శర్మ.

ఆ తర్వాత రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా కలిసి మెరుపులు మెరిపించారు. హార్ధిక్ పాండ్యా 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 13 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు

Follow Us:
Download App:
  • android
  • ios