IPL 2023: ఈ సీజన్ ఆరంభానికి మరో నాలుగు రోజుల టైమ్ మాత్రమే ఉన్నా ఇప్పటికీ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ లేడు. ఏప్రిల్ 1న కేకేఆర్ ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఐపీఎల్- 16 సీజన్ ఈ నెల 31 నుంచి మొదలుకానుంది. ఇప్పటికే వివిధ ప్రాంచైజీలు సన్నాహక శిబిరాలు పార్ట్ 1, 2, 3 కూడా ముగించాయి. రాబోయే సీజన్ లో ఎవర్ని ఆడించాలి..? ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరు సెట్ అవుతారు..? ప్రత్యర్థి జట్ల బలాబాలాలు ఏంటి..? జట్టు కూర్పు ఎలా..? ఎవర్ని ఆడిస్తే లాభం..? అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాయి. 9 ఫ్రాంచైజీలు దాదాపు ఇవే ఆలోచనలతో ఉంటే ఒక్క ఫ్రాంచైజీ మాత్రం వీటన్నింటికీ దూరంగా... ‘మాకు కెప్టెన్ కావాలి బాబోయ్..’అని జుట్టు పీక్కుంటున్నది. ఆ ఫ్రాంచైజీయే ఐపీఎల్ లో రెండుసార్లు కప్ కొట్టిన కోల్కతా నైట్ రైడర్స్.
ఈ సీజన్ ఆరంభానికి మరో నాలుగు రోజుల టైమ్ మాత్రమే ఉన్నా ఇప్పటికీ ఆ జట్టుకు కెప్టెన్ లేడు. గతేడాది వేలంలో రూ. 12. 5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి సారథ్య పగ్గాలు కూడా అప్పజెప్పిన శ్రేయాస్ అయ్యర్ ఈ ఏడాది వెన్ను గాయం కారణంగా సీజన్ కు ఆడేది అనుమానంగానే ఉంది. దీంతో ఆ జట్టుకు సారథి అత్యావశ్యకమయ్యాడు.
రోజులు గడుస్తున్నా.. ఐపీఎల్ ప్రారంభ తేదీ ముంచుకొస్తున్నా కేకేఆర్ ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటం ఆ జట్టు అభిమానుల్లో ఆందోళనను పెంచుతున్నది. ఈసారి సారథ్య రేసులో జట్టులో సీనియర్ మోస్ట్ ప్లేయర్లుగా ఉన్న సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, షకిబ్ అల్ హసన్ లతో పాటు నితీశ్ రాణా ల పేరు వినిపించింది. తాజాగా ఈ జాబితాలో కొత్త పేరు చేరింది. అతడే శార్దూల్ ఠాకూర్.
త్వరలో విడుదల..!
కేకేఆర్ కెప్టెన్సీ రేసులో సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ లు ముందు వరుసలో ఉన్నారని సమాచారం. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని సారథిగా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కేకేఆర్ వర్గాలు తెలిపాయి. కేకేఆర్ టీమ్ ఓనర్, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. త్వరలోనే ఓ భారీ ఈవెంట్ వంటిది ఏర్పాటు చేసి కెప్టెన్ ను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.
జట్టులో సీనియర్ ప్లేయర్ గా ఉన్న నరైన్ కే కేకేఆర్ సారథ్య పగ్గాలు అప్పజెప్పే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. నరైన్.. కేకేఆర్ తో గడిచిన 11 సీజన్లుగా ఉన్నాడు. ఒక జట్టు తరఫున ఇన్ని సీజన్లు ఆడిన క్రికెటర్లలో నరైన్ ప్రథమస్థానంలో ఉంటాడు. కేకేఆర్ తరఫున ఆడుతూ 148 మ్యాచ్ లలో 152 వికెట్లు పడగొట్టాడు.
అదీగాక ఇటీవలే యూఏఈ వేదికగా జరగిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20)లో కోల్కతా ఫ్రాంచైజీ పెట్టుబడులు పెట్టిన అబుదాబి నైట్ రైడర్స్ కు సునీల్ నరైన్ సారథిగా వ్యవహరించాడు. ఈ లీగ్ లో అబుదాబి టీమ్ పది మ్యాచ్ లు ఆడి ఒకదాంట్లోనే గెలిచింది. అయినా నరైన్ కే కేకేఆర్ పగ్గాలు అప్పజెప్పేందుకు టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ‘పఠాన్’ నరైన్, శార్దూల్ లలో ఎవరి పేరును ప్రకటిస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఈనెల 31న ఐపీఎల్ మొదలుకానుండగా ఏప్రిల్ 1న కేకేఆర్.. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తో తొలి గేమ్ ఆడనుంది.