IPL 2021: మారన్ గారు..! వాళ్లను డబ్బులిచ్చేయమనండి సార్.. SRH ప్లేయర్స్ పై నెటిజన్ల ట్రోలింగ్
Sun Risers Hyderabad: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అత్యంత చెత్తగా ఆడిన జట్లలో నెంబర్ వన్ గా నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్ లో తొమ్మది మ్యాచులు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. ఏకంగా ఎనిమిదింటిలో ఓడి దారుణ పరాజయం మూటగట్టుకుంది. దీంతో రైజర్స్ ఆటగాళ్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘నాగార్జున గారూ.. చూడండి సార్ వీడు. ఇంక నా వల్ల కాద్సార్.. ఇలాంటి వాళ్ల వల్ల మీ షోకు ఎంత లాసో తెలుసా.. వీళ్లను ఎలిమినేట్ చేయండి సార్.. ఎలిమినేట్ దెమ్ ఇమిడియెట్లీ..’ అంటూ దూకుడు సినిమాలో హస్యబ్రహ్మ బ్రహ్మనందం చేసే హంగామా అంతా ఇంతా కాదు. సరిగ్గా ఇదే విధంగా స్పందిస్తున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు. ఈ సీజన్ లో అత్యంత చెత్తగా ఆడి ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయిన జట్టుపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక నెటిజన్లైతే కొంత మంది ప్లేయర్లను టీమ్ నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
శనివారం నాటి మ్యాచ్ లో పంజాబ్ చేతిలో పరాజయాన్ని జీర్ణించుకోని అభిమానులు.. మనీష్ పాండే, కేదార్ జాదవ్ వంటి ఆటగాళ్లను జట్టు నుంచి వదిలించుకోవడం మంచిదని సన్ రైజర్స్ యజమాని కళానిధి మారన్ కు సూచిస్తున్నారు. వాళ్లిద్దరూ ఫ్రాంచైజీ ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లించాలని మండిపడుతున్నారు.
వీళ్లిద్దరూ రైజర్స్ కు భారంగా మారారని.. పాండే, జాదవ్ లు మిడిలార్డర్ జాతిరత్నాలు అని సంబోధిస్తున్నారు. నిన్నటి మ్యాచ్ లో జాదవ్ 12 బంతులాడి 12 పరుగులే చేయగా.. పాండే 23బంతుల్లో 13 పరుగులు చేశాడు. గత మ్యాచ్ లలోనూ వీరి ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. ఈ ఇద్దరూ జట్టులో ఉన్నామంటే ఉన్నాం అన్న చందంగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అంతేగాక సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని ఉంటే రైజర్స్ భవితవ్యం మరో విధంగా ఉండేదని పలువురు అభిమానులు వాపోతున్నారు. వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడం.. జట్టులో ఐక్యత లేకపోవడం.. చిన్న లక్ష్యాలను కూడా ఛేదించక చేతులెత్తేస్తున్నా టీమ్ కూర్పును మార్చకపోవడం చాలా మందికి కోపం తెప్పించింది.