భారత్-పాక్ అభిమానులను ఉర్రూతలూగించే ‘మోకా మోకా’ యాడ్ మళ్లీ వచ్చేసింది.. ఐసీసీ టోర్నీల్లో దీని క్రేజే వేరప్పా..
New Mauka Mauka Add: ఐసీసీ ఈవెంట్లలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లకు ఉండే క్రేజే వేరు. ఆ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించాలని కొంతమంది అనుకుంటే ఇక టీవీలకు అతుక్కుపోయే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఈ క్రేజ్ ను సొమ్ము చేసుకోవడానికి టెలివిజన్ ఛానెళ్లు వినూత్న రీతిలో యాడ్స్ రూపొందిస్తున్నాయి.
ఐసీసీ ఈవెంట్లలో భారత్-పాకిస్తాన్ (INDIA vs PAKISTAN) మ్యాచ్ లకు ఉండే క్రేజే వేరు. దాయాదుల మధ్య పోరును ప్రత్యక్షంగా వీక్షించాలని కొంతమంది అనుకుంటే.. ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ టీవీలకు అతుక్కుపోయే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు రానురానూ క్షీణిస్తున్న తరుణంలో క్రికెట్ మ్యాచ్ కాస్తా రెండు దేశాల మధ్య యుద్ధంలా మారిపోతుంది. ఇక ఈ హై ఓల్టేజీ మ్యాచ్ ను చూసే ప్రేక్షకులకు యాడ్స్ రూపంలో తమ వ్యాపారాలను మరింత చేరువ చేయడానికి వ్యాపార సంస్థలు పోటీలు పడుతుంటాయి. అందుకే ఈ క్రేజ్ ను సొమ్ము చేసుకోవడానికి టెలివిజన్ ఛానెళ్లు వినూత్న రీతిలో యాడ్స్ రూపొందిస్తున్నాయి.
గత కొద్దికాలంగా భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ‘మోకా.. మోకా’ (Mauka Mauka) యాడ్ రావాల్సిందే. ఐసీసీ (ICC)ఈవెంట్లలో భారత్ ను పాక్ ఓడిస్తుందనే ఆశతో ఓ పాక్ అభిమాని క్రాకర్లు, స్వీట్ బాక్సులు పట్టుకురావడం.. తీరా మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడంతో అతడు కుంగిపోతుంటాడు. గత కొద్దికాలంగా టీవీ ప్రేక్షకులను ఈ యాడ్ విపరీతంగా అలరిస్తోంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (ICC T20 World Cup) లో భాగంగా పాకిస్థాన్ తో భారత్ ఈనెల 24న తలపడనున్న నేపథ్యంలో ఈ యాడ్ మళ్లీ వచ్చింది.
స్టార్ స్పోర్ట్స్ (Star Sports) రూపొందించిన ఈ యాడ్ ను ఆ సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ యాడ్ లో ఎప్పుడూ కనిపించే పాక్ అభిమానే క్రాకర్స్ పట్టుకుని ఓ టీవీ షో రూంలోకి రావడం.. ఈసారి తమ జట్టు తప్పక గెలుస్తుందనడం.. ఇది చూసిన సదరు షాప్ ఓనర్ అతడికి ఓ బంపరాఫర్ ఇవ్వడం వంటివి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నది.
ఇది కూడా చదవండి: IPL2021: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల గుండె పగిలిన క్షణం.. కన్నీరుమున్నీరైన రిషభ్ పంత్, పృథ్వీ షా
వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లతో పాటు టీ20 ప్రపంచకప్ లో కూడా పాకిస్థాన్ జట్టుకు భారత్ పై తలవంచడం ఎప్పుడూ జరిగేదే. పొట్టి ఫార్మాట్ లో 2007 టీ20 ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు తొలిసారి పోటీ పడ్డాయి. ఆ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. అదే టోర్నీ ఫైనల్ లో కూడా ధోని (MS Dhoni) సేన.. షోయబ్ మాలిక్ (Shoaib malik) నేతృత్వంలోని పాక్ ను చిత్తుగా ఓడించి కప్ నెగ్గింది. ఇరు జట్లు టీ20 ఫార్మాట్ లో చివరిసారి 2016 లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కూడా భారత్ ఘనవిజయం సాధించింది.
కాగా.. 2015 నుంచి ఈ యాడ్ ను స్టార్ స్పోర్ట్స్ రూపొందిస్తున్నది. ప్రతి ప్రపంచకప్ లో భారత్-పాక్ మ్యాచ్ కు ముందు ఈ యాడ్ ను కొత్తగా విడుదల చేస్తున్నది. ఒక పాక్ అభిమాని.. 1992 వరల్డ్ కప్ నుంచి భారత్ పై పాక్ గెలవాలని అతడు ఆశించడం.. చివరికి భంగపాటు తప్పకపోవడం వంటివి ఇందులో ఫన్నీగా చూపిస్తున్నారు. 2011 వరల్డ్ కప్ సమయంలో అతడికి పెళ్లి అయి కొడుకు పుట్టిన తర్వాత కూడా పాక్ పరిస్థితి మారదు. అప్పుడు తన కొడుకుతో మ్యాచ్ చూసే పాక్ అభిమానిని.. ‘మనం క్రాకర్స్ ఎప్పుడూ కాలుస్తాం డాడీ..’ అని అడుగుతాడు. ఇక తాజా యాడ్ లో అదే పాక్ అభిమానికి ఓ టీవీ షోరూం ఓనర్.. ‘బై వన్ బ్రేక్ వన్’ అని చెప్తూ కనిపించారు. 2012 ఈ యాడ్ నూ మీరూ ఎంజాయ్ చేయండి మరి..!