Asianet News TeluguAsianet News Telugu

సారీ... నేను వరల్డ్ కప్ ఆడడం లేదు! రిపోర్టర్‌కి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెస్ ధోనీ...

క్రికెట్ గురించి మాహీని ప్రశ్నించబోయిన రిపోర్టర్... తాను వరల్డ్ కప్ ఆడడం లేదని, టీమ్ ఇప్పటికే ఆస్ట్రేలియాకి వెళ్లిపోయిందని కౌంటర్ ఇచ్చిన ధోనీ... 

Sorry I am not Playing World Cup, Mahendra Singh Dhoni cheeky reply to reporter
Author
First Published Oct 22, 2022, 2:50 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్‌తో యమా బిజీగా గడిపేస్తున్నాడు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. గత ఏడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి మెంటర్‌గా వ్యవహరించిన ఎమ్మెస్ ధోనీ, ఈసారి పూర్తిగా జట్టుకి దూరంగా ఉన్నాడు...

2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ, అప్పటి నుంచి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 2020, 2022 సీజన్లలో ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్, 2021 సీజన్‌లో మాహీ కెప్టెన్సీలో నాలుగోసారి టైటిల్ గెలిచింది...

టీమిండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన మాహీ, రాంఛీలో ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాహీకి క్రికెట్‌కి సంబంధించిన ప్రశ్న అడిగాలని భావించాడు ఓ మీడియా ప్రతినిధి. ‘మాహీ భాయ్... వరల్డ్ కప్ దగ్గర్లో ఉంది. క్రికెట్ గురించి ప్రశ్న అడగకపోతే అస్సలు బాగోదు...’ అంటూ మీడియా ప్రతినిధి అనగానే... ‘సారీ... నేను వరల్డ్ కప్ ఆడడం లేదు... టీమ్ ఇప్పటికే ఆస్ట్రేలియాకి వెళ్లిపోయింది...’ అంటూ కౌంటర్ ఆన్సర్ ఇచ్చాడు ధోనీ...

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు, 2011లో వన్డే వరల్డ్ కప్‌ని కైవసం చేసుకుంది. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజేతగా నిలిచింది టీమిండియా. మాహీ జట్టులో లేకుండా తొలిసారి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడింది భారత జట్టు. మాహీ అనుభవం టీమిండియాకి ఉపయోగపడాలనే ఉద్దేశంలో అతన్ని భారత జట్టుకి మెంటర్‌గా వ్యవహరించింది బీసీసీఐ.

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు ప్రాక్టీస్ మ్యాచుల్లో తెగ హడావుడి చేసిన మాహీ, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌తో మ్యాచుల్లో చిత్తుగా ఓడిన తర్వాత టీవీలో కనిపించడం కూడా మానేశాడు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి మాహీని జట్టుకి దూరం పెట్టింది బీసీసీఐ... 

మాహీ తర్వాత భారత సారథిగా బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ... 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడింది...

అలాగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ఆడిన భారత జట్టు, టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. ఐపీఎల్‌లో ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో బరిలో దిగుతోంది భారత జట్టు. ఈసారి టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి.. 

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన మాహీ... ‘ఓరియో బ్రాండ్ ప్రమోషన్’ కార్యక్రమంలో పాల్గొన్నాడు.  ‘2011లో ఓరియో ఇండియాలో లాంఛ్ అయ్యింది, టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది... ఈసారి మళ్లీ ఓరియా రీలాంఛ్ అవుతోంది... ఈసారి కూడా ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది...’ అంటూ బ్రాండ్ ప్రమోషన్‌ని ఓ పెద్ద సంచలన ప్రకటనలా పదే పదే చెప్పాడు ధోనీ...

Follow Us:
Download App:
  • android
  • ios