సంజూ కెరీర్కు ఎండ్ కార్డ్ వేశారా? మరి ఎందుకు తప్పించినట్టు.. కారణం చెప్పండి.. బీసీసీఐపై ప్రశ్నల వర్షం
Sanju Samson: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్ కు మరోసారి నిరాశే మిగిలింది. న్యూజిలాండ్ తో సిరీస్ కు అతడిని బీసీసీఐ పట్టించుకోలేదు.
స్వదేశంలో శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ తో పాటు ఆస్ట్రేలియాతో సిరీస్ లు ఆడనుంది. కివీస్ తో వన్డే, టీ20లు ఆడనుండగా ఆసీస్ తో టెస్టు, వన్డేలు ఆడుతుంది. ఈ మేరకు ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ శుక్రవారం రాత్రి కివీస్ తో వన్డే, టీ20 సిరీస్ లతో పాటు ఆసీస్ తో రెండు టెస్టులకూ జట్టను ప్రకటించింది. అయితే ఈ మూడు ఫార్మాట్లలో ఒక్కదాంట్లో కూడా సంజూ శాంసన్ పేరు లేదు. లంకతో సిరీస్ కు ఎంపికైన శాంసన్ ను కివీస్ తో సిరీస్ లో ఎందుకు ఎంపిక చేయలేదనేది అతడి ఫ్యాన్స్ తో పాటు టీమిండియా అభిమానులనూ నిరాశకు గురిచేసింది.
గత ఏడాదిన్నర కాలంగా శాంసన్ పై బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. దేశవాళీతో పాటు ఐపీఎల్ లో కూడా నిలకడగా రాణిస్తున్న శాంసన్ ను జట్టులోకి ఎంపిక చేయలేకపోవడం.. చేసినా బెంచ్ కే పరిమితం చేయడం.. ఒకటి, రెండు మ్యాచ్ లు ఆడించి తర్వాత పక్కనబెట్టడం చేస్తున్నది.
అయితే తాజాగా లంకతో టీ20 సిరీస్ లో ఎంపికైన అతడు.. తొలిమ్యాచ్ లో ఆడాడు. వాంఖెడే వేదికగా ముగిసిన ఆ మ్యాచ్ లో పీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయితే గాయమైన రెండ్రోజులకే శాంసన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘నేను బాగానే ఉన్నా’అని పోస్టు పెట్టడంతో లంకతో సిరీస్ మిస్ అయినా కివీస్ తో అయినా తిరిగి జట్టుతో చేరతాడని అంతా భావించారు. కానీ సెలక్టర్లు అతడికి మరోసారి మొండిచేయి చూపారు.
కెఎల్ రాహుల్ ను కివీస్ తో వన్డే సిరీస్ కు ఎంపిక చేయలేదు. ఆ స్థానానికి సంజూ ను ఎంపిక చేయాల్సింది పోయి కెఎస్ భరత్ ను తీసుకురావడం విమర్శలకు తావిచ్చింది. అయితే ఒకవేళ శాంసన్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదా..? అంటే దానిమీద కూడా బీసీసీఐ ఇంతవరకు ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలో సంజూ మద్దతుదారులు బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న రాత్రి కివీస్, ఆసీస్ తో సిరీస్ లకు జట్లను ప్రకటించిన తర్వాత శాంసన్ మద్దతుదారులు ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘అసలు సంజూ శాంసన్ చేసిన తప్పేంటి..? ఎందుకే అతడికి ఇలా పదే పదే జరుగుతుంది. వాళ్లు (బీసీసీఐ) కారణం చెప్పాలి..’, ‘ఎందుకు శాంసన్ ను ప్రతీసారి ఇగ్నోర్ చేస్తున్నారు. జితేశ్ శర్మకు బదులు శాంసన్ ను ఎంపిక చేస్తే బాగుండేది కదా. సెలక్షన్ సిస్టమ్ లో కూడా ఏదైనా కోటాను అమలుచేస్తున్నారా..?’, ‘అంటే సంజూ శాంసన్ కెరీర్ ఇక ముగిసినట్టేనా..?’ అని కామెంట్స్ చేస్తున్నారు.