సెహ్వాగ్ ఆ మాట నాముందు అనుంటే అక్కడే పాతరేసేవాణ్ణి.. అక్తర్ షాకింగ్ కామెంట్స్.. జర్నలిస్టుపై ఆగ్రహం
Shoaib Akhtar:పాకిస్తాన్ మాజీ దిగ్గజం రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. గతంలో సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై అతడు..
పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయభ్ అక్తర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో అతడిపై టీమిండియా స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై అతడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ ఓ సందర్భంలో తాను పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు అక్తర్ తనకు బౌన్సర్ వేసినప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న సచిన్ ను చూపించానని, నీ ప్రతాపం అక్కడ చూపించు అని చెప్పానని చెబుతూ.. ఆ తర్వాత సచిన్ బ్యాటింగ్ చేస్తూ అక్తర్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టాక అతడితో.. ‘బాప్ బాప్ హోతా హై’ అని అన్నానని వీరూ చెప్పాడు.
తాజాగా అక్తర్ భారత జర్నలిస్టుతో ముఖాముఖిలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సదరు జర్నలిస్టు అతడిని ‘వీరేంద్ర సెహ్వాగ్ మిమ్నల్ని ‘బాప్ బాప్ హోతా హై’ అన్నాడన్న కామెంట్స్ గురించి మాకు తెలుసు. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా ఇంకా అలాంటి ఘటనలేమైనా జరిగాయో చెబుతారా..?’ అని ప్రశ్నించింది.
దీంతో చిర్రెత్తుకొచ్చిన అక్తర్.. ఆగ్రహంతో ఊగిపోయాడు. అక్తర్ స్పందిస్తూ.. ‘ఫస్ట్ నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా.వీరూ నిజంగానే ఆ కామెంట్ నా ముందు చేసుంటే అతడు బతికుండేవాడు కాదు. సెహ్వాగ్ ఈ కామెంట్ ఎప్పుడు, ఎందుకు చేశాడో నాకైతే తెలియదు. ఇదే విషయమై నేను ఒకసారి బంగ్లాదేశ్ లో సెహ్వాగ్ ను కూడా అడిగాను. కానీ వీరూ మాత్రం తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని బదులిచ్చాడు.
రెండో విషయమేమిటంటే.. మనం క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూమెంట్ ను ఎంజాయ్ చేద్దాం. ఈ పనికిమాలిన ప్రశ్నల వల్ల వచ్చేదేమీ లేదు. ఇండియా అంటే నాకు చాలా గౌరవముంది. మిమ్నల్ని (జర్నలిస్టును ఉద్దేశిస్తూ) కూడా నేను గౌరవిస్తున్నాను. ఇలాంటి కామెంట్స్ వల్ల రెండు దేశాల మధ్య ఉన్న ప్రశాంతతను నేను చెడగొట్టదలుచుకోలేదు..’ అని ఘాటుగా బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.