అక్తర్ భ్రమల్లో బ్రతుకుతాడు.. బ్రాండ్ల కంటే మనిషిగా మారడం ముఖ్యం.. పీసీబీ మాజీ చీఫ్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ కు ఇంగ్లీష్ రాదని కామెంట్స్ చేసిన మాజీ పేసర్ షోయభ్ అక్తర్ పై పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా మండిపడ్డాడు. అతడు భ్రమల్లో బ్రతుకుతాడని సెటైర్లు వేశాడు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చీఫ్ రమీజ్ రాజా , ఆ జట్టు మాజీ పేసర్ షోయభ్ అక్తర్ పై విమర్శలు గుప్పించాడు. అక్తర్ భ్రమల్లో బ్రతికే సూపర్ స్టార్ అని సెటైర్లు వేశాడు. బాబర్ ఆజమ్ ను విమర్శించేముందు తనను తాను చూసుకోవాలని అన్నాడు. మాజీ క్రికెటర్లను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని, అది తప్ప మరొకటి తెలియదని వాపోయాడు.
మూడు రోజుల క్రితం అక్తర్ ఓ లోకల్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కు ఇంగ్లీష్ సరిగా రాదని అందుకే అతడి వెంట బ్రాండ్స్ పడటం లేదని అన్నాడు. అంతేగాక కమ్రాన్ అక్మల్ పైనా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై రమీజ్ రాజా స్పందించాడు. అక్తర్ వ్యాఖ్యలకు రమీజ్ ఘాటుగా బదులిచ్చాడు. ‘షోయభ్ అక్తర్ భ్రమల్లో బ్రతికే సూపర్ స్టార్. అతడు అందరూ బ్రాండ్ లా మారిపోవాలని కోరుకుంటాడు. బాబర్ కు ఇంగ్లీష్ రాదన్న అక్తర్.. కొద్దిరోజుల క్రితం పాక్ మాజీ సారథి కమ్రాన్ అక్మల్ గురించి ఇదే వాగుడు వాగాడు.
మన మాజీ క్రికెటర్లు మన దేశం తరఫున ఆడుతున్న ఆటగాళ్లను డీగ్రేడ్ చేస్తున్నారు. మన పొరుగు దేశం (ఇండియా) లో సీనియర్ క్రికెటర్లు ఎవరైనా అలా చేయడం చూశారా..? సునీల్ గవాస్కర్ ఎప్పుడైనా రాహుల్ ద్రావిడ్ ను విమర్శించాడా..? కానీ ఇక్కడ (పాకిస్తాన్) మాత్రం మన క్రికెటర్లను ఇష్టారీతిన విమర్శిస్తారు. మాజీ ఆటగాళ్లు వారి పాత్రలను ప్రొఫెషనల్ గా నిర్వర్తిస్తే బెటర్..’అని చెప్పాడు.
కాగా అక్తర్ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కావాలనుకున్నాడని విలేకరులు ప్రశ్నించగా దానికి రమీజ్ సమాధానమిస్తూ.. ‘పీసీబీ చీఫ్ సంగతి తర్వాత గానీ ముందైతే అతడు తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనివ్వండి..’అని సెటైర్లు విసిరాడు. 1997 నుంచి 2011 వన్దే వరల్డ్ కప్ వరకు పాకిస్తాన్ తరఫున ఆడిన అక్తర్.. ఆట తర్వాత క్రికెట్ గురించి విశ్లేషణలు చేస్తున్నాడు.
కాగా రమీజ్ రాజా గతంలో పీసీబీ చైర్మెన్ గా ఉండగా తనపై విమర్శలు చేసిన వారిని టార్గెట్ చేస్తూ తిరిగి వారికి లెక్క అప్పజెప్పుతున్నాడు. ఈ క్రమంలోనే నిన్న పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ పై కూడా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. పీఎస్ఎల్ లో భాగంగా తన టీమ్ (కరాచీ కింగ్స్) ఓడిపోవడంతో అక్రమ్.. తన ముందున్న చైర్ ను తన్నుతూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ వీడియోపై రమీజ్ స్పందిస్తూ.. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోకుంటే ఇంట్లో కూర్చోవాలని అతడికి సూచించాడు.