Asian Games 2023: ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ తో పాటు భారత్ మరో ఆసక్తికర టోర్నీ ఆడనుంది.  2010, 2014 తర్వాత  ఆసియా క్రీడల్లో ఈ ఏడాది క్రికెట్ ను ఆడించనున్నారు.

గతేడాది కరోనా వ్యాప్తి కారణంగా చైనాలో వాయిదా పడిన ఏసియన్ గేమ్స్ - 2023 ఈ ఏడాది సెప్టెంబర్ లో జరుగనున్నాయి. ఈ మేరకు తేదీలు కూడా ప్రకటించారు నిర్వాహకులు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జో వేదికగా ఏసియన్ గేమ్స్ జరుగుతాయి. ఈ క్రీడల్లో క్రికెట్ ను కూడా చేర్చారు. 2010, 2014 తర్వాత ఆసియా క్రీడల్లో క్రికెట్ ను ఆడిస్తుండటం ఇదే ప్రథమం.

హాంగ్జో వేదికగా సెప్టెంబర్ నుంచి జరుగబోయే ఈ క్రీడల్లో భారత క్రికెట్ జట్టు కూడా పాల్గొననుందట. ఈ మేరకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నది. వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ నేపథ్యంలో భారత జట్టు ఈ క్రీడల్లో పాల్గొనడటం అనుమానమే అనుకున్నారంతా.. కానీ తాజాగా బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది.

వాస్తవానికి ఆసియా కప్ - 2023 ముగిసిన తర్వాత భారత జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం కానుంది. అయితే సరిగ్గా ఇదే సమయానికి ఆసియా క్రీడలు ఉండటంతో ద్వితీయ శ్రేణి జట్టును పంపించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.

కెప్టెన్‌గా మళ్లీ ధావన్.. 

టీమిండియా ప్రధాన జట్టు ఓ దేశంతో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతుంటే మరో జట్టు కూడా ఇతర దేశంతో మ్యాచ్‌లు ఆడటం టీమిండియాకు కొత్తేంకాదు. 2021 నుంచి బీసీసీఐ ఈ ఫార్ములాను పాటిస్తోంది. ఆసియా క్రీడల్లో కూడా ఇదే ఫార్ములాను అనుసరించనుంది. టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ గా ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపించాలని బీసీసీఐ భావిస్తోంది. ధావన్ నేతృత్వంలో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ముఖేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ వంట యువ ఆటగాళ్లతో కూడిన ద్వితీయ శ్రేణి జట్టును ఆసియా క్రీడల్లో ఆడించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. దీనిపై జులై 7న స్పష్టత వచ్చే అవకాశముంది. అదే రోజు ముంబైలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది.

Scroll to load tweet…

పురుషుల జట్టు ఆసియా క్రీడల్లో ఆడటంపై ఇంకా స్పష్టత రానప్పటికీ మహిళల జట్టు మాత్రం ఈ గేమ్స్ ఆడనుంది. ఆ టైమ్ కు భారత మహిళల జట్టుకు షెడ్యూల్స్ ఏమీలేవు. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఈ పోటీలలో పాల్గొననుంది.