ఫైనల్లో సౌరాష్ట్ర వర్సెస్ మహారాష్ట్ర.. విజయ్ హజారే ట్రోఫీ విజేత ఎవరో..?
Vijay Hazare Trophy 2022: దేశవాళీ లిస్ - ఏ క్రికెట్ లో ప్రముఖంగా వినిపించే విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. బుధవారం జరిగిన రెండు సెమీస్ లలో విజేతలు శుక్రవారం ఫైనల్ పోరులో తలపడనున్నారు.
సుమారు మూడు వారాలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూ రికార్డుల బూజులు దులుపుతున్న విజయ్ హజారే ట్రోఫీ -2022 చివరి దశకు చేరింది. ఇదివరకే సెమీఫైనల్ చేరుకున్న నాలుగు జట్లు బుధవారం అహ్మదాబాద్ లో తాడో పేడో తేల్చుకున్నాయి. సౌరాష్ట్ర - కర్నాటక, మహారాష్ట్ర - అసోం ల మధ్య మ్యాచ్ లు జరగగా సౌరాష్ట్ర, మహారాష్ట్ర లు విజయం సాధించాయి. ఈ రెండు జట్లూ శుక్రవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ పోరులో తలపడతాయి.
బుధవారం ఉదయ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఎ-గ్రౌండ్ లో సౌరాష్ట్ర - కర్నాటక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్ాయచ్ లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర బౌలింగ్ ఎంచుకుంది. సౌరాష్ట్ర బౌలింగ్ కు కర్నాటక కుదేలైంది. ఆ జట్టు బౌలర్ల ధాటికి కర్నాటక.. 49.1 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయింది.
కర్నాటకలో ఓపెనర్ సమర్థ్ (88) తప్ప మిగిలినవారంతా విఫలమయ్యారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1), శరత్ (3), మనీష్ పాండే (0), నికిన్ జోస్ (12), శ్రేయాస్ గోపాల్ (9), మనోజ్ బందగె (22), కృష్ణప్ప గౌతమ్ (0) లు విఫలమయ్యారు. సౌరాష్ట్ర సారథి ఉనద్కత్.. 10 ఓవర్లలో 26 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ప్రేరక్ మన్కడ్ 2 వికెట్లతో రాణించాడు. అనంతరం లక్ష్యాన్ని సౌరాష్ట్ర.. 36.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు హర్విక్ దేశాయ్ (0), షెల్డన్ జాక్సన్ (0) లు డకౌట్ అయినా జయ్ గోహిల్ (61), సమర్థ్ వ్యాస్ (33), ప్రేరక్ మన్కడ్ (35) లు రాణించారు. అర్పిత్ వసవడ (25 నాటౌట్) కూడా మెరిశాడు.
ఇక అసోం-మహారాష్ట్ర మ్యాచ్ లో టాస్ నెగ్గిన అసోం ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. గత మ్యాచ్ లో మాదిరిగానే రుతురాజ్ గైక్వాడ్.. ఈ మ్యాచ్ లో కూడా చెలరేగి ఆడాడు. 126 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 168 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి (3) విఫలమైనా.. బావ్నే (110) సెంచరీతో మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో అసోం అంత ఈజీగా లొంగలేదు. ఆ జట్టులో రిషవ్ దాస్ (53), శివ్ శంకర్ రాయ్ (78), స్వరూపమ్ పుర్కయస్త (95)లు పోరాడారు. గత మ్యాచ్ లో సెంచరీతో రాణించిన రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ లో 15 పరుగులే చేశాడు. చివరి ఓవర్ వరకూ అసోం విజయం కోసం పోరాడింది. చివరికి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. మహారాష్ట్ర బౌలర్లలో రాజ్యవర్ధన్ హంగర్గేకర్ 4 వికెట్లతో చెలరేగాడు.
ఇక సెమీస్ లో గెలిచిన మహారాష్ట్ర - సౌరాష్ట్ర లు డిసెంబర్ 2న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ట్రోఫీ కోసం తలపడనున్నాయి.