మొత్తం చేసిన పరుగులెన్ని..? తీసిన వికెట్లెన్ని..? ఫ్యాన్స్కు సచిన్ ఆసక్తికర ప్రశ్న..
Sachin Tendulkar: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో పాల్గొంటున్న టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ట్విటర్ లో యాక్టివ్ అయ్యాడు. వరుసగా పోస్టులు పెడుతూ అభిమానులను పలకరిస్తున్నాడు.
గతంలో ఏ పండుగకో పబ్బానికో సోషల్ మీడియాలో కనిపించే సచిన్ టెండూల్కర్ మళ్లీ యాక్టివ్ అయ్యాడు. తాజాగా 8 దేశాల మధ్య జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ (ఆర్డబ్ల్యూఎస్) సీజన్-2లో భాగంగా సచిన్ వరుస ట్వీట్స్ తో అభిమానులకు దగ్గరవుతున్నాడు. ఆర్డబ్ల్యూఎస్ సీజన్-2లో ఇప్పటికే పలు పోస్టులతో నెటిజన్లను పలకరించిన సచిన్.. తాజాగా ఒకప్పటి దిగ్గజ క్రికెటర్లంతా కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర ప్రశ్న వేశాడు.
ఆర్డబ్ల్యూఎస్ సీజన్-2 కాన్పూర్, ఇండోర్, డెహ్రాడూన్, రాయ్పూర్ లలో జరుగుతున్నది. ఈ సిరీస్ కోసం నాలుగు ప్రాంతాల మధ్య ప్రయాణం చేస్తున్న క్రికెటర్లకు సంబంధించిన ఓ ఫోటోను సచిన్ తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు.
ఫోటోను షేర్ చేస్తూ సచిన్..‘ఈ ఫోటోలో అంతర్జాతీయ పరుగులు, వికెట్లు ఎన్నో మీరు చెప్పగలరా..?’ అని పేర్కొన్నాడు. ఈ చిత్రంలో సచిన్ తో పాటు యువరాజ్ సింగ్, షేన్ వాట్సన్, షేన్ బాండ్, బ్రెట్ లీ వంటి దిగ్గజ ఆటగాళ్లున్నారు. పలువురు మాజీ క్రికెటర్లున్నా వారి ముఖాలు సరిగా కనిపించడం లేదు. దీంతో పలువురు నెటిజన్లు సచిన్ ప్రశ్నకు సమాధానం చెబుతూ వారికి కనిపించే ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ లో చేసిన పరుగులు, తీసిన వికెట్ల గురించిన సమాచారం షేర్ చేస్తున్నారు.
సుజల్ అధియా అనే ఓ నెటిజన్.. 11,29,24,984 పరుగులు, 24,768 వికెట్లు అని కామెంట్ చేయడం విశేషం. ఇక మరికొంతమంది మాత్రం ఈ ప్రశ్నకు మేం సమాధానం చెప్పలేం సచిన్.. అంటూ స్పందిస్తున్నారు. ఏదేమైనా దిగ్గజ క్రికెటర్లందరినీ ఒక్క చోట చూడటంతో వారి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
మరికొంతమందేమో.. ‘కొంపదీసి ఈ విమానం కూలిపోతే..? ఎవరిది రెస్సాన్సిబులిటీ..?’ అని ప్రశ్నించాడు. దీనికి పలువురు ఆకతాయిలు ‘అయితే అది పాకిస్తాన్ పనే..’అని ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు.