200 టెస్టులు ఆడితే, కరోనా టెస్టులేమో 277... మెడికల్ స్టాఫ్తో టెండూల్కర్ ఫ్రాంక్...
ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో పాల్గొంటున్న సచిన్ టెండూల్కర్...
ఇంగ్లాండ్ లెజెండ్స్తో మ్యాచ్కి ముందు కరోనా టెస్టు...
మెడికల్ సిబ్బంది ముందు చిన్న ఫ్రాంక్ చేసి నవ్వించిన ‘మాస్టర్’...
టీమిండియా తరుపున అత్యధిక టెస్టులు, అత్యధిక వన్డేలు, అత్యధిక సెంచరీలు... ఇలా ప్రపంచక్రికెట్ చరిత్రలోనే తిరుగులేని రికార్డులను తనపేరిట లిఖించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఇంగ్లాండ్ లెజెండ్స్ జట్టుతో టీమిండియా లెజెండ్స్ జట్టు మార్చి 9న తలబడనుంది. ఈ మ్యాచ్కి ముందు మరోసారి కరోనా టెస్టు చేయించుకున్న సచిన్ టెండూల్కర్, మెడికల్ సిబ్బందితో చిన్న ఫ్రాంక్ చేశాడు.
శాంపిల్స్ సేకరించిన తర్వాత నొప్పితో బాధపడుతున్నట్టు నటించి, వెంటనే నవ్వేశాడు. దీంతో ఏమైందోనని ఆశ్చర్యపోయి, ఫ్రాంక్ అని తెలిసి నవ్వేశాడు మెడికల్ స్టాఫ్.
‘నేను 200 టెస్టులు ఆడాను. కానీ 277 కోవిద్ టెస్టులు చేయించుకున్నా... అప్పుడప్పుడు మూడ్ మార్చేందుకు చిన్ని ఫ్రాంక్ మంచిదే... ఇలాంటి విపత్తుతో పోరాడేందుకు సాయపడుతున్న మన మెడికల్ స్టాఫ్కి ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చాడు సచిన్ టెండూల్కర్.