Asianet News TeluguAsianet News Telugu

RR vs MI: యశస్వి జైస్వాల్ సెంచరీ.. సందీప్ పంజా.. ముంబైని చిత్తుచేసిన రాజస్థాన్

RR vs MI: IPL 2024 : హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కి ప్లేఆఫ్‌ల తలుపులు మూసుకుపోయినట్లు కనిపిస్తోంది. తాజా మ్యాచ్ లో ముంబై జ‌ట్టు రాజ‌స్థాన్ చేతితో చిత్తుగా ఓడింది. 
 

RR vs MI IPL 2024 : Yashasvi Jaiswal's century.. Sandeep Panja.. Rajasthan beat Mumbai Indians RMA
Author
First Published Apr 23, 2024, 1:16 AM IST

RR vs MI IPL 2024: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) లో 38వ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌- సంజూ శాంస‌న్ కెప్టెన్సీ లోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. జోరుమీదున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజ‌యంతో ముంబైని చిత్తుగా ఓడించింది. దీంతో వ‌రుస ఓట‌ముల‌తో ముందుకు సాగుతున్న ముంబైకి ప్లేఆఫ్ తలుపులు మూసుకుపోయినట్లు కనిపిస్తోంది. జైపూర్ లో జ‌రిగిన ఈ మ్యాచ్ లో ముంబైపై 9 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. రాజస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ తో రాణించి అన్ని విధాలుగా ముంబైపై ఆధిపత్యం కనబరిచింది. గాయం నుండి తిరిగి వచ్చిన సందీప్ శర్మ ముంబైని పెద్ద స్కోర్ చేయ‌కుండా అడ్డుకున్నాడు.

ముంబై వెన్నువిరిచిన సందీప్ శ‌ర్మ 

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఇది ముంబైకి క‌లిసిర ఆలేదు. కేవలం 6 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వికెట్లు కోల్పోయారు. దీని తర్వాత సందీప్ శర్మ దుమ్మురేపే బౌలింగ్ తో ముంబై వెన్నువిరిచాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయిట్జేలను సందీప్ శర్మ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్ర‌మే స‌మ‌ర్పించుకుని వారి వికెట్లు తీసుకున్నాడు. గాయాం కార‌ణంగా దూరంగా ఉన్న సందీప్ శ‌ర్మ‌ మార్చి 28 తర్వాత బలమైన పునరాగమనం చేసాడు. రాజస్థాన్ తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల పరంగా ఐపీఎల్ చరిత్రలో మూడవ స్థానంలోకి చేరుకున్నాడు.

ముంబైకి తిల‌క్ వ‌ర్మ అండ‌..

రోహిత్ నుంచి హార్దిక్ పాండ్యా వరకు ముంబై టాప్ బ్యాట్స్ మెన్ ఫ్లాప్ షో మ‌ధ్య తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ అద్భుత‌మైన ఆట‌తో రాణించాడు. తిలక్ వర్మ, నేహాల్ వధేరా జట్టుకు గౌరవప్ర‌ద‌మైన స్కోర్ ను అందించారు. తిలక్ వర్మ 45 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేశాడు. ఆ తర్వాత నెహాల్ వధేరా 24 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 49 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ల కారణంగా ముంబై స్కోరు 179కి చేరుకోగలిగింది. ముంబై స్టార్ బ్యాట‌ర్లు రోహిత్ శర్మ 6 పరుగులు, ఇషాన్ కిషన్ 0, సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులు మాత్ర‌మే చేశారు. హార్దిక్ పాండ్యా కూడా కేవ‌లం 10 పరుగులకే పెవిలియ‌న్ బాట‌ప‌ట్టాడు.

యశస్వి జైస్వాల్ సెంచ‌రీ విధ్వంసం.. 

ఐపీఎల్ 2024లో ప్రారంభం నుంచి ఫ్లాప్ షో చూపిస్తున్న యశస్వి జైస్వాల్ ముంబైపై బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 104 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. జోస్ బట్లర్ కూడా 35 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీని తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ జైస్వాల్‌కు మద్దతుగా నిలిచాడు. శాంసన్ 28 బంతుల్లో 38 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఈ గెలుపుతో రాజస్థాన్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.

చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చహల్.. ఐపీఎల్ లో 200 వికెట్లు.. !

Follow Us:
Download App:
  • android
  • ios